Financial crisis : ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతున్నది. అప్పులు తెచ్చుకోవడంలో ఏపీ సీఎం జగన్ ను మించిన నాయకుడే దేశంలో లేడని అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. సుపరిపాలన అందిస్తానని ప్రజలకు నమ్మబలికి అధికారంలోకి వచ్చిన జగన్ తనకు అడ్డు ఎవరూ లేరన్నంతగా రెచ్చిపోతున్నారు. ఏపీని ఆర్థికంగా దివాలా స్థితికి తీసుకొచ్చారు.
అయితే రాష్ట్రాలకు నిధులను న్యాయబద్ధంగా వాడుకోవాలని తాజాగా జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ సూచించారు. ఏపీకి రుణాల గుదిబండ భారంగా మారింది. భావితరాలు ఇబ్బంది పడతాయని సోయి లేకుండా, ఏపీ భవిష్యత్తుతో జగన్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని అభిప్రాయం ఆర్థికంగా నిపుణుల నుంచి వినిపిస్తున్నది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం బకాయిల భారం మార్చి నాటికి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు దాటింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రెండు నెలల్లోనే ఏపీ ప్రభుత్వం 13,500 కోట్ల మేర రుణాలు సేకరించినట్లు సమాచారం. బడ్జెట్లో చూపించకుండానే పెద్ద ఎత్తున అప్పులు తెచ్చి రెవెన్యూ ఖర్చుకు పెడుతున్నారని గతంలోనే కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. రుణ సేకరణలో నిబంధనలు పట్టించుకోవడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా గతంలోనే ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయినా అవేమీ జగన్ సర్కార్ కు పట్టడం లేదు. సంపద సృష్టిని పక్కన పెట్టేశారు.
ఉత్తరాంధ్ర రాయలసీమను అభివృద్ధిలో టాప్ లో నిలుపుతామని చెప్పిన వైకాపా, ఆ నిర్ణయాన్ని పక్కకు పెట్టినట్లే కనిపిస్తున్నది. పరిశ్రమలను ప్రోత్సహించడం ఉపాధికి ఊతం ఇవ్వడం లాంటి విషయాల్లో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. కేవలం మాటలకే పరిమితమై మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తున్నదని అపవాదు మూట గట్టుకున్నది.