
Himalayas Trekking : హిమాలయాల్లో ట్రెక్కింగ్కు వెళ్లిన ఐదుగురు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సహస్రతల్లో చోటుచేసుకుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రష్మీ మహేష్ తెలిపిన ప్రకారం.. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మొత్తం 22 మంది యాత్రికులు జూన్ 4న ఉదయం సహస్రతల్లో ఆల్పైన్ సరస్సు ఎగువ హిమాలయ ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లారు. అలా వెళ్లిన వారు జూన్ 7న తిరిగి బేస్ క్యాంప్నకు చేరుకోవాల్సి ఉండగా.. దారి తప్పారు. అక్కడ నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ 22 మందిలో కర్ణాటకకు చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు గల్లంతయ్యారు.
విషయం తెలుసుకున్న స్థానికులు మంగళవారం సాయంత్రం ట్రెక్కింగ్ అసోసియేషన్ విపత్తు నిర్వహణ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది ట్రెక్కర్స్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వారికి తోడుగా ఇండియన్ ఎయిర్ఫోర్స్ ప్రత్యేక హెలికాప్టర్తో రంగంలోకి దిగి మొత్తం 13 మందిని కాపాడింది. కాగా, ఈ దుర్ఘటనలో మరణించిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు.