
Free Bus Scheme : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఒక్కొక్క అడుగు వేస్తోంది. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే జూలై నెల నుంచి పెంచిన పెన్షన్లను అందించే కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది. మరోవైపు.. ఇటీవలె ఉచిత ఇసుక పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఇక చంద్రబాబు గెలిచినప్పటి నుంచి ఏపీలోని మహిళలు ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసేందుకు ముహూర్తం ఖరారు అయినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
స్వాతంత్య్ర దినోత్సవం(ఆగస్టు 15) సందర్భంగా ఏపీలో ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో మూతపడిన అన్న క్యాంటీన్లను ఆగస్టు 15న ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అదే రోజు మొదలుపెట్టాలని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పథకం అమలుకు సంబంధంచి తుది కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 16న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం అమలుకు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 15 వ తేదీన చంద్రబాబు విశాఖలో ఈ పథకం ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరు పైన ఆర్టీసీ అధికారుల నుంచి ప్రభుత్వం నివేదికలు కోరింది. నిత్యం ఎంతమంది మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు.. ఈ పథకం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంత మేర భారం పడుతుంది.. ఈ ఉచిత బస్సు అమలులో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి.. ఆర్థికంగా తీసుకోవాల్సిన చర్యల పైనా పూర్తి స్థాయిలో అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లలో ఈ ఉచిత బస్సు పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఉన్న బస్సులతో ఈ పథకం అమలు చేస్తే.. సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు.