
అప్పట్లో సంచలనం సృష్టించిన జియాఖాన్ సూసైడ్ కేసు కొలిక్కి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఆమె ప్రియుడు, నటుడు సూరజ్ పంచోళిని నిర్ధోషిగా తేల్చింది ముంబై సీబీఐ కోర్టు. ఆయన కారణంగానే ఆమె సూసైడ్ చేసుకున్నట్లు ఎలాంటి ఆధారలు లేవని సూరజ్ నిర్ధోషి అంటూ కోర్టు స్పష్టం చేసింది.
3 జూన్, 2013లో ముంబైలోని తన ఫ్లాట్ లో జియాఖాన్ సూసైడ్ చేసుకుంది. దానికి ముందు ఆమె ఆరు పేజీలు సూసైడ్ నోట్ కూడా రాసింది. జియాఖాన్ సూసైడ్ నోట్ ఆధారంగా అప్పట్లో పోలీసులు సూరజ్ ను అరెస్ట్ చేశారు. ఆమె రాసిన లేఖను బట్టి సూరజే నిందితుడని పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసులో సూరజ్ కు వ్యతిరేకంగా పోలీసుల ఎలాంటి సాక్ష్యాలు ప్రవేశ పెట్టకపోవడంతో కేసు వీగిపోయింది. జియాఖాన్ ఆత్మహత్యకు ప్రేరేపించాడని అభియోగం ఎదుర్కొంటున్న సూరజ్ ఆ పని చేయలేదని కోర్టు నమ్మింది. అయితే ఈ కోర్టు తీర్పున హీరోయిన్ జియాఖాన్ తల్లి హై కోర్టులో సవాల్ చేస్తానని చెప్పింది.
అమితాబ్ తో కలిసి ‘నిశబ్ధ’ సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందింది జియాఖాన్. మొదటి చిత్రం నుంచే మంచి నటన ప్రదర్శించిన ఆమె చేసింది మూడు సినిమాలే అయినా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఈ క్రమంలోనే సూరజ్ పంచోళితో ప్రేమాయణం కొనసాగించారు. దాదాపు సంవత్సరం పాటు జియాఖాన్, సూరజ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు.
కెరీర్ దూసుకెళ్తున్న సమయంలో ఊహించని విధంగా ఆమె సూసైడ్ చేసుకుంది. దీనికంతటికి కారణం సూరజే అంటూ జియాఖాన్ తల్లి ఆరోపించారు. శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేయడంతోనే తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందని ఆమె రోధించారు. అప్పట్లో సూరజ్ కు అండగా సల్మాన్ ఖాన్ కూడా నిలుచున్నాడని వార్తలు వినిపించాయి.






