
Extra-Marital Affair : వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను దగ్గరుండి హత్య చేయించిందో భార్య. ఇరు కుటుంబాల మధ్యలో ఉన్న పాతకక్షలను మనసులో పెట్టుకుని నిందితుడి ఇల్లాలు అతడికి సహకరించి దారుణ ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడెం పట్టణానికి గౌతంపూర్ కాలనీకి చెందిన రమేష్ ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సాహు ఈశ్వర్ కుమార్ భార్య ఎండి రెహనాతో రమేష్ అక్రమసంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం కొన్నాళ్ల క్రితమే ఈశ్వర్ కుమార్ కు తెలిసింది.
సింగరేణి క్వార్టర్స్ లో అక్రమంగా నివసిస్తున్న రమేశ్ను అక్కడి నుంచి పంపించేయాలని నిశ్చయించుకున్నాడు. కొందరు స్థానికులతో కలిసి సింగరేణి అధికారులకు ఫిర్యాదు చేశారు. రమేశ్ కుటుంబాన్ని అధికారులు ఖాళీ చేయించారు. ఈ క్రమంలో ఈశ్వర్ కుమార్ తన భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ విషయాన్ని రెహనా తన ప్రియుడు రమేష్ కి చెప్పి ఎలాగైన తన భర్త అడ్డు తొలగించుకొవాలని అతడిని రెచ్చగొట్టింది. రమేష్ తో కలిసి ఈశ్వర్ హత్యకు కుట్రపన్నింది.
ఇందులో భాగంగా ఈనెల 6న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈశ్వర్కుమార్పై రమేశ్, అతడి అల్లుడు బట్టు చందు, భార్య ఇందిర కత్తులతో దాడిచేశారు. ఆ సమయంలో రెహనా ఇంటి ముందు కాపలా కాసింది . త్రీవంగా గాయపడిన ఈశ్వర్ కుమార్ ను చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందాడు.
గతంలో ఇల్లు ఖాళీ చేయించాడనే కక్షతోనే రమేష్ కుటుంబం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు, ఇతర కుటుంబ సభ్యులను నమ్మించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈశ్యర్ కుమార్ భార్య రెహనా పై అనుమానంతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగుచూసింది. నలుగురు నిందితులను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.