
Mumbai : ముంబైలో భారీ వర్షాలు ఎయిర్ పోర్టు కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దాదాపు 27 విమానాలను దారి మళ్లించారు. అవి హైదరాబాద్, అహ్మదాబాద్, ఇండోర్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ అయ్యాయి. ఈరోజు (సోమవారం) ఉదయం 11 గంటల సమయానికి 50కి పైగా విమానాలను రద్దు చేశారు. వీటిల్లో ఎయిర్ ఇండియా, ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్, ఖతార్ ఎయిర్ వేస్ కు చెందినవి ఉన్నట్లు సమాచారం.
ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ముంబై వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో 300 మి.మీ.ల పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గోవండి ప్రాంతంలో 315 మి.మీ., పవాయిలో 314 మి.మీ. వర్షం కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు మునిగిపోవడంతో చాలా లోకల్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రైల్వే స్టేషన్లలో నిలిచిన నీటిని తొలగించేందుకు శక్తివంతమైన మోటార్లను ఏర్పాటు చేశారు. కుర్లా వద్ద భారీ వర్షాల కారణంగా రాష్ట్ర మంత్రి అనిల్ పటేల్ సహా 15 మంది ప్రజాప్రతినిధులు ఒక రైలులో చిక్కుకుపోయారు.