
Hemant Soren : జార్ఖండ్ అసెంబ్లీలో సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గింది. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేతృత్వంలోని పాలక కూటమికి అనుకూలంగా 45 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపడంతో సోరెన్ ప్రభుత్వం బలపరీక్షలో సునాయాసంగా గట్టెక్కింది. భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి దాదాపు 5 నెలల తర్వాత బెయిల్ పై హేమంత్ సోరెన్ బయటకు వచ్చారు. ఆ తరువాత జులై 4న మూడోసారి జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ క్రమంలో సోమవారం ఆయన అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొన్నారు. జార్ఖండ్ స్పీకర్ రవీంద్రనాథ్ మహ్తో విశ్వాస తీర్మానంపై చర్చకు గంట సమయం కేటాయించారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ఆమోదం పొందడంతో హేమంత్ సోరెన్ తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది.
కాగా, 81 సీట్లు ఉన్న అసెంబ్లీలో ప్రస్తుతం 76 మంది సభ్యులున్నారు. అసెంబ్లీ బల పరీక్షలో 38 ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం అసెంబ్లీలో జేఎంఎం కూటమికి 45 మంది (జేఎంఎం 27, కాంగ్రెస్ 17, ఆర్జేడీ 1) ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్షానికి 30 మంది సభ్యులు ఉన్నారు.