
Aghori : చీటింగ్ కేసులో అరెస్టయిన అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా, అతని వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. చేవెళ్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో అల్లూరి శ్రీనివాస్ను జైలుకు తరలించే ప్రక్రియలో ఈ వివరాలు వెలుగుచూశాయి.
సంగారెడ్డి జైలు తిరస్కరణ.. వైద్య పరీక్షల సంచలనం..
కోర్టు ఆదేశాల మేరకు తొలుత అల్లూరి శ్రీనివాస్ను సంగారెడ్డి సబ్ జైలుకు తీసుకెళ్లారు. అయితే, అతను ఆడ? మగా? అన్న దానిపై స్పష్టత లేదని చెప్పి అక్కడి జైలు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో, పోలీసులు తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అల్లూరి శ్రీనివాస్ ట్రాన్స్జెండర్ ఫిమేల్ అని వైద్యులు నిర్ధారించారు. అంతేకాకుండా, గతంలో రెండు సార్లు లింగమార్పిడి చేసుకున్నట్టు వైద్యులు గుర్తించారు.
చంచల్ గూడ జైలుకు తరలింపు..
వైద్య రిపోర్ట్ ఆధారంగా ట్రాన్స్జెండర్ అని తేలడంతో, వారిని తమ జైల్లో ఉంచుకోవడం సాధ్యం కాదని సంగారెడ్డి జైలు సిబ్బంది స్పష్టం చేశారు. తెలంగాణలో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక బ్యారక్ల సదుపాయం కేవలం చంచల్గూడ జైలులో మాత్రమే ఉంది. దీంతో, అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ను చివరికి చంచల్గూడ జైలుకు తరలించి, అక్కడ ట్రాన్స్జెండర్స్ సెల్లో ఉంచారు.
శంకర్పల్లి పీఎస్ లో వర్షిణి హంగామా..
మరోవైపు, అల్లూరి శ్రీనివాస్తో పాటు పట్టుబడిన వర్షిణిని ప్రస్తుతం శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో తాత్కాలికంగా ఉంచారు. అయితే, వర్షిణి తీవ్ర హంగామా సృష్టిస్తోంది. తనను కూడా అఘోరి శ్రీనివాస్ వద్దకే పంపాలని, లేదంటే లేడీస్ జైల్లో ఉంచాలని గొడవ చేస్తోంది. వారం రోజుల్లో శ్రీనివాస్ జైలు నుంచి బయటకు వస్తాడని తనకు చెప్పినట్టు చెబుతోంది. తన బీటెక్ చదువును కూడా పోలీసులు పూర్తి చేయించాలని వింత డిమాండ్లు చేస్తూ, పోలీసులతో వాగ్వాదానికి దిగుతోంది. అరుపులు, తిట్లు, ఏడుపులతో పోలీస్ స్టేషన్లో రచ్చ రచ్చ చేస్తోంది.
వర్షిణి మానసిక పరిస్థితి పై అనుమానాలు..
వర్షిణి ప్రవర్తన చూసి ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్నాళ్లు ఆమెను రీ హాబిలిటేషన్ సెంటర్లో ఉంచి చికిత్స అందించాలని పోలీస్ అధికారులు భావిస్తున్నారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో, వర్షిణి తల్లిదండ్రులు శంకర్పల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. కూతురును తమతో ఇంటికి వచ్చేయమని బతిమాలుకున్నారు. మంగళగిరికి తీసుకెళ్తామని, అవసరమైతే అక్కడ రీ హాబిలిటేషన్ సెంటర్లో చేర్పిస్తామని చెప్పారు.
అయితే, వర్షిణి తల్లిదండ్రులతో వెళ్లేందుకు ససేమిరా అంది. అఘోరి శ్రీనివాస్ తోనే ఉంటానని, లేదా తన అత్తారింటికి వెళ్తానని అంటూ హంగామా చేసింది. తమ కూతురును తమతో పంపాలని తల్లిదండ్రులు పోలీసులను వేడుకున్నారు. కానీ, వర్షిణి మానసిక ఆరోగ్యం దృష్ట్యా ప్రస్తుతం తల్లిదండ్రులతో పంపించలేమని పోలీసులు స్పష్టం చేశారు. మొత్తం మీద, అఘోరి వ్యవహారంతో పాటు వర్షిణి పరిస్థితి కూడా పోలీసులకు తలనొప్పిగా మారింది.