
Gold Trading : గోల్డ్ ట్రేడింగ్ పేరిట హైదరాబాద్ లో భారీ మోసం జరిగింది. దాదాపు 500 మందిని మోసగించి రెండు నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న వ్యాపారి రాజేశ్ ను సీసీఎస్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలంటూ బషీర్ బాగ్ లోని సీసీఎస్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
హబ్సీగూడ స్ట్రీట్ నంబర్ 8లో ప్రహణేశ్వరి ట్రేడర్స్ పేరుతో రాజేశ్ అనే వ్యక్తి కార్యాలయం ఏర్పాటు చేశాడు. అధిక లాభాలు ఆశ చూపి ఒక్కొక్కరి వద్ద రూ.5 లక్షల నుంచి రూ. కోటి వరకు వసూలు చేసి పరారయ్యాడు. పెట్టుబడిగా పెట్టిన డబ్బును ఐదు నెలల్లో రెట్టింపు చేస్తామని, పెట్టుబడిలో 2 శాతం లాభాలను వారానికోసారి చెల్లిస్తామని నమ్మించి మోసం చేశాడని బాధితులు తెలిపారు. మొదటి రెండు నెలలు లాభాలు చెల్లించడంతో నమ్మకం కలిగి భారీ మొత్తంలో డబ్బులు అతడికి ఇచ్చినట్లు వాపోయారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.