
Hyderabad-Ayodhya Flights : హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా నిర్వహిస్తున్న విమాన సర్వీసును ఈనెల 1 నుంచి నిలిపివేసినట్లు స్పైస్ జెట్ వెల్లడించింది. ఈ మార్గంలో విమాన సర్వీసులను రెండు నెలల క్రితం కంపెనీ ప్రారంభించింది. వారానికి 3 సర్వీసుల చొప్పున స్పైస్ జెట్ విమానాలు నడిపింది. అయితే తగినంత గిరాకీ లేకపోవడంతో, ఈ సర్వీసులను నిలిపివేసినట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి.
స్పైస్ జెట్ అయోధ్యకు తన మొదటి విమానం ఎస్ జి611 ఏప్రిల్ 2న ప్రారంభించింది. ఆ రోజు ఉదయం 10.45 గంటలకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి 12.45 గంటలకు అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఆ తరువాత తిరుగు ప్రయాణంలో ఎస్ జి 616 అయోధ్య నుంచి 1 గంటకు బయలుదేరి మధ్యాహ్నం 3.25 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంది. ఈ విధంగా వారంలో మూడు సార్లు స్పైస్ జెట్ ఈ సర్వీస్ కొనసాగించింది.
ఫిబ్రవరి నెల వరకు స్పైస్ జెట్ ఎనిమిది భారతీయ నగరాల నుంచి అయోధ్యకు సర్వీస్ ప్రారంభించింది. ప్రస్తుతం స్పైస్ జెట్ అహ్మదాబాద్, ఢిల్లీల నుంచి అయోధ్యకు నేరుగా విమానాలను నడుపుతోంది. అయోధ్య రామమందిరం ప్రారంభమైన తరువాత వేగంగా పుంజుకున్న పర్యాటకం క్రమంగా క్షీణించింది. దీంతో పర్యాటకుల సంఖ్య బాగా తగ్గింది. స్పైస్ జెట్ తన సర్వీసులను కూడా తగ్గిస్తోంది.