
Satires on Jagan : ఏపీలో 151 మంది ఎమ్మెల్యేలతో అప్రతిహతంగా అధికారం చలాయించిన వైసీపీకి తాజా ఎన్నికల ఫలితాలు బిగ్ షాక్ ఇచ్చాయి. ఏకంగా 11 సీట్లకు ఆ పార్టీ పడిపోయింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అయినా ఏపీ మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి తీరులో ఎలాంటి మార్పు కనిపించలేదు. తాననుకున్నదే నిజమనే భావనతోనే ఆయన కొనసాగుతున్నారు. ఐదేళ్లలో జనంతో పూర్తిగా సంబంధాలను కట్ చేసుకుని పాలన సాగించడమే తాజా ఎన్నికల్లో జగన్ ఓటమికి కారణమైంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా జగన్ను కలిసేందుకు అభిమానులు, నాయకులు, పార్టీ వర్గాలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తాడేపల్లి, పులివెందుల, బెంగుళూరులో పెద్ద ఎత్తున అభిమానులు కలిసేందుకు వెళ్లినా ఎవరికి ముఖం కూడా చూపలేదు. బెంగుళూరు నుంచి తిరుగు ప్రయాణానికి ముందు స్వయంగా జగన్ ఆదేశాలతోనే సందర్శకుల్ని అనుమతించినట్టు తెలుస్తోంది.
ప్రశ్నలకు జవాబు చెప్పడం, ప్రశ్నలను ఆహ్వానించడాన్ని జగన్ పెద్దగా ఇష్టపడరు. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్ల నుంచి అదే ధోరణి జగన్లో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నపుడు, గత ఐదేళ్లలో కూడా ఇదే తీరుతో జగన్ వ్యవహరించారు. ఆయన చెప్పేది అంతా వినాలని భావిస్తారే తప్ప జనం ఏమనుకుంటున్నారో, జనం చెప్పేది వినాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ఆ తర్వాత అధికారం కోసం పాదయాత్ర పేరుతో నిత్యం జనాల్లో ఉన్నారు. అధికారం వచ్చిన తర్వాత తనకు తానుగా ప్రజల నుంచి పూర్తిగా దూరం జరిగిపోయారు. తాడేపల్లి నివాసంలో స్వీయ నిర్బంధం విధించుకుని అంతా అద్భుతంగా జరిగిపోతుందనే భావనలో ఐదేళ్లు గడిపేశారు.
జనానికి తాను పూర్తిగా మేలు చేశానని చెప్పుకున్నారే తప్ప, జనం పడుతున్న ఇబ్బందులు, లోపాలను గుర్తించే ప్రయత్నం చేయలేదు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి, ప్రజలకు మరేమి అవసరం లేదనే ధోరణితో జగన్ ఉండిపోయారు. ఆయన చుట్టూ ఉన్న సలహాదారులు సైతం జగన్ మనసెరిగి ప్రవర్తించారు. తనకు నచ్చని విషయాన్ని స్వీకరించే అలవాటు జగన్కు లేదని తెలుసుకుని లౌక్యం ప్రదర్శించారు. కానీ ప్రజలు మాత్రం ఆయన మాకు దూరంగా ఉన్నాడనుకుని అలాగే ఉండాలని ఓట్లేయకుండా ఓడించారు. ఇప్పుడు మళ్లీ ఆయన తీరు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మళ్లీ జనాల్లోకి వెళ్లాలని భావిస్తున్నారట.
ఈ విషయం తెలియగానే సోషల్ మీడియాలో జగన్ పై ట్రోలింగ్ మొదలైంది. 151 సీట్లు ఇచ్చినప్పుడు పత్తాలేవు.. 11 సీట్టు ఇచ్చినప్పుడు కనపడుతున్నావ్.. వచ్చేసారి ఒకటే ఇస్తాం మాతోనే ఉండు నాయనా అంటూ థంబ్ నేల్స్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు.