
Aarogyasri Card Update : సీఎం క్యాంపు ఆఫీస్ (సీఎంసీఓ) పేరుతో ఆరోగ్య శ్రీ కార్డు లేని వారికి ఇచ్చే అనుమతి పత్రాలను ఏపీ ప్రభుత్వం పునరుద్ధరించింది. ఎన్నికల కోడ్ కారణంగా వీటిని ప్రభుత్వం నిలిపివేసింది. తాజాగా వీటిని పునరుద్ధరిస్తూ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈఓ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆరోగ్య శ్రీ కార్డు లేని వారు సంబంధిత పత్రాలతో స్కీమ్ అనుబంధ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స పొందొచ్చు. కలెక్టర్ ఆమోదంతో ట్రస్ట్ అధికారులు ఈ పత్రాలను జారీ చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకువచ్చింది. ఇది ప్రజా ఆరోగ్య కార్యక్రమం. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1న రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో ప్రారంభించారు. ఈ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు తెచ్చుకొంది. ఈ పథకంలో అర్హులైన పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. టీడీపీ ప్రభుత్వం 2014లో ఈ పథకానికి డాక్టర్ నందమూరి తారక రామారావు ఆరోగ్య సేవగా పేరు మార్చింది. అయితే వైఎస్ జగన్ సీఎం పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఈ పథకం ఆరోగ్యశ్రీ గానే కొనసాగుతోంది.