
IND vs PAK : ప్రపంచంలోనే అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే క్రీడల్లో భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఒకటి. ఎన్ని దేశాలు క్రికెట్ ఆడినా..ఈ జట్ల మధ్య మ్యాచ్ అంటేనే అంతర్జాతీయంగా ఉత్కంఠ నెలకొంటుంది. దేశ భక్తితో కూడిన తీవ్ర భావోద్వేగమే కాదు, ఆట మజా కూడా పీక్స్ లో ఉంటుంది. ఇక ఇండియా, పాక్ ల మ్యాచ్ ను కోట్లలో వీక్షిస్తారు. దీంతో నిర్వాహకులకు కాసుల వర్షం కురుస్తోంది. ఇక బెట్టింగ్ రాయుళ్లకు డబ్బులే డబ్బులు. వందల కోట్లలో బిజినెస్ నడుస్తుంది.
ఇక మొన్ననే టీ-20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టును టీమిండియా జట్టు చితక్కొట్టేసింది. దశాబ్దాలుగా వరల్డ్ కప్ టోర్నీల్లో పాకిస్తాన్ పై భారత్ దే పైచేయి అని మనకు తెలిసిందే. ఇదిలా ఉంటే 2025లో జరుగబోయే అతిపెద్ద టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ. వరల్డ్ కప్ తర్వాత అత్యంత కీలకమైన ట్రోఫీ ఇది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరుగబోయే చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇప్పటికే పాక్ క్రికెట్ బోర్డు ముసాయిదా షెడ్యూల్ ను ఐసీసీకి అందించింది. అయితే ఈ షెడ్యూల్ కు బీసీసీఐ ఆమోదం తెలుపలేదని సమాచారం. తాజాగా మరో విషయం బయటకు వచ్చింది.
గత ఆసియా కప్ జరిగినట్టే చాంపియన్స్ ట్రోఫీని కూడా హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించాలనే ప్రపోజల్ ను ఐసీసీ ఎదుట బీసీసీఐ పెట్టినట్టు చెబుతున్నారు. భారత్ మ్యాచ్ లను వేరే ప్రాంతానికి తరలించి..మిగతా వాటిని పాక్ వేదికగానే నిర్వహించుకునే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే పాకిస్తాన్ కు తమ జట్టును పంపించేది లేదని.. భారత్ ఆడే మ్యాచ్ లను మార్చాల్సిందేనని బీసీసీఐ పట్టుబట్టినట్టు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. భద్రతాపరమైన సమస్యల నేపథ్యంలో అసలు పాక్ కే వెళ్లకూడదనే కృతనిశ్చయం బీసీసీఐ ఉంది. దీంతో భారత్ ఆడే వేదికలను శ్రీలంక లేదా దుబాయ్ కు మార్చాలనే కండీషన్ ను పెట్టింది.