
Modi : ప్రపంయానికి భారత దేశం బౌద్ధాన్నిచ్చిందని పీఎం మోదీ అన్నారు. ఆస్ట్రియాలో మోదీ భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచానికి భారత్ బౌద్ధాన్ని ఇచ్చిందని.. యుద్దాన్ని కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భారత్ ఎప్పుడూ సర్వ మానవాళి శాంతి, సామరస్యాలే కోరుకుందని తెలిపారు. 21వ శతాబ్దంలో ఆ బాధ్యతను మరింత సమర్థంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వేల సంవత్సరాలుగా భారత్ తమ నైపుణ్యాన్ని, విజ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకుంటోందని గుర్తుచేశారు. తద్వారా యుద్ధానికి బదులు, శాంతి, సామరస్యాన్నిప్రచారం చేస్తోందని తెలిపారు. ప్రపంచం ఇప్పుడు భారత్ ను ‘విశ్వబంధు’గా చూస్తోందని.. అది మనందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు.
భారత్ తరహాలోనే ఆస్ట్రియా చరిత్ర, సంస్కృతి చాలా పురాతనమైనది, గొప్పదని మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య బంధాలు చరిత్రాత్మకమైనవని గుర్తు చేశారు. దీనివల్ల ఉభయ దేశాలూ లబ్ధి పొందాయన్నారు. సంస్కృతి, వాణిజ్యం.. అన్ని రంగాల్లో సహకారం కొనసాగుతోందన్నారు. మోదీ ప్రసంగిస్తున్నంత సేపు అక్కడి ప్రవాసులు ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ నినాదాలతో హోరెత్తించారు.
అనంతరం రష్యా, ఆస్ట్రియా పర్యటనను ముగించుకునన మోదీ భారత్ కు బయలుదేరారు. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆస్ట్రియా ఛాన్స్ లర్ కార్ల్ నెహమ్మర్, అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండరర్ బెల్లెన్ తో ప్రధాని ఫలవంతమైన చర్చలు జరిపారు. వివిధ అంశాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని పరస్పరం నిర్ణయించారు.