
India VS Australia : మరికాసేపట్లో భారత్, అస్ర్టేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ప్రారంభం కాబోతున్నది. లండన్ లోని ఓవల్ మైదానం ఇందుకు వేదిక కాబోతున్నది. బుధవారం నుంచి ఈనెల 11 వరకు ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచి, కప్పుతో ఇండియాకు చేరుకోవాలని రోహిత్ సేన భావిస్తు్న్నది. ఈ క్రమంలో ఇప్పుడు తుది జట్టులో ఎవరెవరికి అవకాశం వస్తుందనేది కీలకం కానుంది. బలమైన జట్టుతో బరిలోకి దిగితేనే ఆస్ర్టేలియాపై పై చేయి సాధిస్తామని టీమిండియా భావిస్తున్నది. మైదానంలో పరిస్థితులను బట్టి తుది జట్టును ప్రకటించే అవకాశం కనిపిస్తున్నది.
పాత జట్టేనా..?
ఆస్ర్టేలియా నాలుగో టెస్టు ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతారని అంతా అనుకుంటన్నారు. ఒకరిద్దరు మినహా అంతా తుది జట్టుకు ఎంపికవుతారని తెలుస్తున్నది. రోహిత్, శుభ్ మన్ గిల్, పూజారా, కోహ్లీ ప్రధానంగా ఉంటారు. ఇక శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రహానేకు చాన్స్ దక్కే అవకాశం ఉంది. రవీంద్ర జడేజాకు కూడా జట్టులో ఆల్ రౌండర్ గా చొట్టు దక్కేలా కనిపిస్తున్నది.
అయితే ఇప్పుడు మైదానంలో బౌలర్ల ఎంపికే కీలకం. మైదానాన్ని బట్టి పేసర్లు, స్పిన్నర్లకు అవకాశం దక్కనుంది. మరి అశ్విన్, షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, జైదేవ్ లో ఎవరికి చాన్స్ దక్కుతుందోననే చర్చ కొనసాగుతున్నది. మరోవైపు రెండో స్పిన్నర్ అవసరం లేదనుకుంటే శార్దూల్ ఠాకూర్ కు కూడా అవకాశం దక్కుతుంది.
ఇక వికెట్ కీపర్ విషయానికి వస్తే కేఎస్ భరత్ కు అవకాశం దక్కే చాన్స్ ఉంది. మరోవైపు దూకుడుగా ఆడే ఇషాన్ కిషన్ కు ఈ మ్యాచ్ లో చాన్స్ ఇస్తారో లేదో అనుమానంగానే ఉంది. ఇషాన్ కు ఇది తొలి టెస్ట్ కానుంది. మరి ఆరంగేట్రమే ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కానుంది. ఏదేమైనా బలమైన ప్రత్యర్థి కావడంతో అందుకు తగ్గట్టుగానే జట్టు కూర్పు ఉండే అవకాశం ఉంది. రోహిత్ ఈమేరకు జట్టు మేనేజ్ మెంట్ తో కలిసి
నిర్ణయం తీసుకోనున్నారు. ఈ చాంపియన్ షిప్ ను సాధించడం ద్వారా టీమిండియా సత్తా మరోసారి చాటాలని రోహిత్ సేన భావిస్తున్నది. విదేశీ గడ్డపై జరుగుతున్న ఈమ్యాచ్, అందులోనూ ఆస్ర్టేలియాతో ఫైనల్ కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి.






