
India Vs Ireland : న్యూయార్క్ లోని నసవు ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన టీ 20 మ్యాచ్ లో ఐర్లాండ్ ను ఇండియా చిత్తు చేసింది. టాస్ గెలిచి కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ తీసుకున్నాడు. ఓపెనింగ్ స్పెల్ వేసిన అర్షదీప్, సిరాజ్ స్పింగ్, సీమ్ తో ఐరిష్ బ్యాట్స్ మెన్స్ ను ముప్పతిప్పలు పెట్టారు.
బాడీ లైన్ బంతులతో, బౌన్సర్లతో నిప్పులు చెరిగే బంతులు వేశారు. ఐరిష్ ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్, బాల్బరిన్ ను 2, 5 పరుగులకే అర్షదీప్ పెవిలియన్ కు చేర్చాడు. బుమ్రా కూడా బౌలింగ్ లో నిప్పులు చెరగడంతో ఐర్లాండ్ 50 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడిపోయింది. ఐరిష్ బ్యాట్స్ మెన్ డిలానే 2 సిక్సులు, 2 ఫోర్లతో 14 బంతుల్లోనే 26 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో రనౌట్ అయ్యాడు. బుమ్రా మూడు ఓవర్లు వేసి కేవలం ఆరు పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టగా.. ఐర్లాండ్ 16 ఓవర్లలో కేవలం 96 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇండియా విరాట్ కొహ్లి వికెట్ ను 22 పరుగుల వద్దే కోల్పోయింది. విరాట్ కొహ్లి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అడైర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన రిషబ్ పంత్, ఓపెనర్ రోహిత్ శర్మ మొదటి ఆరు ఓవర్లు ఆచితూచి బ్యాటింగ్ చేసి పవర్ ప్లేలో కేవలం 39 పరుగులే చేశారు.
అనంతరం జూలు విదిల్చిన రోహిత్ శర్మ 36 బంతుల్లోనే 57 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. చివరి వరకు క్రీజులో ఉన్న రిషబ్ పంత్ 36 పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించాడు. సూర్య కుమార్ రెండు పరుగులకే అవుటయ్యాడు. ఈ పిచ్ టీ 20 కి సరిపోయే పిచ్ కాదని తేలిపోయింది. పిచ్ చాలా డేంజర్ గా కనిపించింది. ఇరు జట్లలోని ఆటగాళ్లు బాల్స్ ను సరిగా అంచనా వేయలేక గాయాలపాలయ్యారు. రోహిత్ కూడా ఫిఫ్టి చేసిన తర్వాత భుజానికి గాయం కావడం వల్ల రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.