CM Jagan : ఏపీ సీఎం జగన్ రెండు రోజులపాటు ఢిల్లీ టూర్ లో ఉన్నారు. అక్కడ నీతి ఆయోగ్, పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ ప్రధాని మోదీ, అమిత్ షాను కలిశారు. ఆయన ఇటీవల బీజేపీతో కలిసి సాగేందుకు అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. అయితే తాజా మరో చర్చ మొదలైంది..
ఏపీలో ముందస్తు ఎన్నికలకు అధికార వైసీపీ సిద్ధమవుతున్నదనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే సీఎం జగన్ కేంద్రం నుంచి అనుమతి పొందారని తెలుస్తున్నది. తెలంగాణ ఎన్నికలతో ఏపీలో కూడా ముందస్తుకు వెళ్లాలని ఆయన భావస్తున్నట్లు సమాచారం. అయితే మరికొంత కాలం ఆగితే ప్రభుత్వ వ్యతిరేకత కొంత పెరిగే అవకాశం ఉంటుందని, మరోవైపు పొత్తుల ద్వారా టీడీపీ, జనసేనకు సమయం ఇచ్చే అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం రాష్ర్ట ఖజానాలో చిల్లిగవ్వ లేదు. రానున్న రోజులు గడ్డు కాలమే. దీంతో వ్యతిరేకత మరింత పెరుగుతుంది. ఇది చంద్రబాబుకు అనుకూలంగా మారుతుంది. ప్రస్తుతం ఏపీలో సంక్షేమ పథకాల అమలుకే డబ్బులు సరిపోవడం లేదు. ఉద్యోగులకు సమయానికి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఏనెలకు ఆ నెల అప్పులు తెస్తే కాని వెళ్లని పరిస్థితి. దీంతో ముందస్తుకు వెళ్తేనే బాగుంటుందని వైసీపీ భావిస్తున్నది. మరోవైపు తనకు రాజకీయ మిత్రుడైన కేసీఆర్ బాటలోనే జగన్ నడిచే అవకాశం ఉంది.
అయితే టీడీపీ, జనసేనల మధ్య పొత్తుపై సఖ్యత కుదురుతుందా అనేది కూడా చర్చ మొదలైంది. సీట్ల సర్దుబాటు విషయాలు బెట్టు వీడకపోతే మొదటికే ముప్పు వచ్చే అవకాశం ఇరు పార్టీలకు ఉంటుంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న నియోజకవర్గాల నేతలు అధినేతల నిర్ణయానికి తలొగ్గుతారా అనేది కూడా అనుమానంగానే కనిపిస్తుంది. ఎలాగైనా ఈసారి పార్టీ అధికారంలోకి రావాలనే భావించే వారు తప్పా మిగతా వారు పోటీకే మొగ్గు చూపుతారు. ఇక రెబల్ గా బరిలోకి దిగితే వైసీపీకి ప్లస్ అవుతుంది. మరి ఏపీలో రానున్న కాలమంతా మూడు పార్టీలకు కీలకమే.