
CM KCR meet : కేంద్రంలోని బీజేపీని ఢీకొట్టేందుకు విపక్షాలన్ని సిద్ధమవుతున్నాయి.. కాదు.. కాదు.. ఏకమవుతున్నాయి. శుక్రవారం(ఈనెల 23న) బిహార్ రాజధాని పాట్నాలో ఈ మేరకు సమావేశానికి ప్లాన్ చేశాయి. జాతీయ పార్టీ కాంగ్రెస్ తో సహా పలు ప్రాంతీయ పార్టీలు ఈ సమావేశానికి హాజరుకాబోతున్నాయి. కాంగ్రెస్, జేడీయూ, టీఎంసీ, ఎన్సీపీ, ఆప్, ఎస్పీ, తదితర ప్రధాన పార్టీల అధినేతలు ఈ భేటీకి హాజరుకాబోతున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి అవలంబించాల్సిన వ్యూహాలపై 15 పార్టీలు ఇందులో చర్చించనున్నాయి.
బిహార్ సీఎం అధికారిక నివాసం ‘నెక్ సంవాద్ కక్షా’లో ఈ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికే పార్టీల అధినేతలు పాట్నా చేరుకోనుండగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ భేటీ కొనసాగుతుందని సమాచారం. అయితే ఈ భేటీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గే, యువనేత రాహుల్ గాంధీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం క్రేజీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫారూఖ్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మోహబూబా ముఫ్తీ, తదితరులు హాజరుకాబోతున్నారు.
అయితే ఇక్కడ ప్రస్తుతం చర్చంతా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనే. ఈ భేటీకి ఆయన హాజరవుతున్నారా.. లేదా అనేది ఇప్పుడు టాక్. కొన్నాళ్లుగా జాతీయ రాజకీయాలకు కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ అని హడావుడి చేసినా, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన సైలెంట్ అయ్యారు. విపక్షాల భేటీలకు అసలు హాజరు కావడం లేదు. కానీ ఇప్పుడు పాట్నా భేటీకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే దీనిని బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ధ్రువీకరించలేదు. బీజేపీ నేత ఒకరు మాత్రం పాట్నా సమావేశానికి వెళ్తున్నారని ఇటీవల వ్యాఖ్యానించారు.
బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలను ఒకేతాటికి తీసుకువచ్చేందుకు, లోక్సభ ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు జరుగుతున్న ఈ సమావేశానికి ఆయన హాజరు కావాలనుకుంటున్నట్లు సమాచారం. దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు జరిగే విపక్ష సదస్సుకు బీజేపీని వ్యతిరేకించేవారంతా రావాలని పిలుపునిస్తున్నారు. బీజేపీతో కేసీఆర్ రాజీ వైఖరి అవలంబిస్తున్నారని ఇప్పుడు ప్రచారం జరుగుతున్నది. దీంతో తెలంగాణలో బీజేపీ ఢీలా పడిపోయింది. బీఆర్ ఎస్ , బీజేపీ ఒక్కటేనని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి వెళ్తే బీజేపీకి మంచి చేసినట్లవుతుంది. దీంతో పాటు బీఆర్ఎస్ కాంగ్రెస్ వైపే ఉందని మరో కొత్త ప్రచారం జరిగే అవకాశం కూడా ఉంటుంది.
అయితే దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా జరుగుతున్న ఈ సమావేశానికి దేశంలోని ప్రధాన పార్టీలన్నీ హాజరవుతున్న నేపథ్యంలో ఇక కేసీఆర్ కూడా హాజరవుతే బాగుంటుందనే అంశం తెరపైకి వచ్చింది. మరో వైపు ఏపీ నుంచి రెండు ప్రధాన పార్టీలూ ఈ సమావేశానికి హాజరవడం లేదు. టీడీపీ, వైసీపీ బీజేపీతో సఖ్యతను కోరుకుంటున్న నేపథ్యంలో ఈ సమావేశానికి హాజరుకావడం లేదని సమాచారం.






