
IAS – IPS officers : ప్రభుత్వం, అధికారం.. ఒకే దారంతో నేసిన పూలలా ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని తెలిస్తే అధికారులు సమగ్రంగా వివరిస్తూ మరీ హెచ్చరించాలి లేదంటే అధికారులు కూడా అదే అవినీతిలో కొట్టుకుపోవాల్సి వస్తుంది. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారవచ్చు. కానీ అధికార యంత్రాంగం మాత్రం మారదు (బదిలీలు జరగవచ్చు).
జగన్ ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అతి చేశారని ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. అలాంటి వారిని ఎన్నికల సమయంలోనే ఈసీ పక్కన పెట్టింది. ఇక బాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, ప్రవీణ్ ప్రకాష్, శ్రీలక్ష్మి, మురళీధర్ రెడ్డి, రజిత్ భార్గవతో సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టేసి ఇతర సమర్థులైన అధికారులతో టీం ఏర్పాటు చేసుకుంటున్నారు.
జగన్ వీరవిధేయుడిగా గుర్తింపు సంపాదించుకున్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ పక్కన పెట్టింది. ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించగా, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గుప్తాకు హోమ్ శాఖ కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ తిరుమల రావును ఏపీ డీజీపీగా నియమించారు.
ప్రభుత్వం మారినప్పుడల్లా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు, మార్పులు చేర్పులు సహజమే. కానీ అధికారంలో ఉన్నవారి మెప్పు కోసం నిబంధనలు అతిక్రమించి వ్యవహరించేవారి పరిస్థితి ఎలా ఉంటుందో.. రాజకీయాలకు దూరంగా డ్యూటీలు చేసుకునేవారి పరిస్థితి ఎలా ఉంటుందో ఈ మార్పులను చూస్తే అర్థం అవుతుంది.
అధికారంలో ఉన్న పార్టీలు ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామనో లేదా రాబోయే ఎన్నికల్లో తామే గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమా లేదా భ్రమలో ఉండడం సహజమే. కానీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వాటి గురించి అలాగే భావిస్తూ, వాటి కోసం పరిధి దాటి వ్యవహరిస్తుండడమే ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఉదాహరణకు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి గతంలో ఓబుళాపురం మైనింగ్ వ్యవహరంలో జైలుకి వెళ్లాల్సి వచ్చింది. కనుక మళ్లీ ఆమె డ్యూటీలో చేరినప్పుడు మళ్లీ అటువంటి తప్పులు చేయరనే ఎవరైనా భావిస్తారు. కానీ జగన్ కోసం మళ్లీ అనేక తప్పులు చేశారు. కనుక సీఎం చంద్రబాబు ఆమెను కూడా పక్కన పెట్టేశారు.
గమనించాల్సిన విషయం ఏంటంటే బాబు ఎంపిక చేసుకున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇంతకాలం జగన్ ప్రభుత్వంలో పనిచేసినవారే. కానీ వారు తమ పరిధికి లోబడి విధులు నిర్వర్తించుకుంటూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ జగన్ వారిని ఏమీ చేయలేకపోయారు.
కనుక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయాలకు దూరంగా ఉంటూ విధులను సక్రమంగా నిర్వహిస్తే వారికే మంచిది. అదే వారికి శ్రీరామరక్షగా కాపాడుతుందని గ్రహిస్తే మంచిది.