
KCR silence : తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యుహాలు ఎవరికీ అంతుచిక్కవు. ప్రతిపక్ష పార్టీలపై కేసీఆర్ వేసే సెటైర్లు మామూలుగా ఉండవు. అయితే తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. బహిరంగ సభలు, సమావేశాల్లో ఏ చిన్న అవకాశం దొరికినా బీజేపీ పై విరుచుకుపడే సీఎం కేసీఆర్ ఆ పార్టీ ఊసే ఎత్తడం లేదు.
సీఎం కేసీఆర్ ఇటీవల జిల్లాల్లో పర్యటించి కొత్త పథకాలు, కొత్త కలెక్టరేట్లు ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లోనూ మాట్లాడారు. ఒక్కసారి కూడా ఆయా కార్యక్రమాల్లో బీజేపీ పేరెత్తకుండా ప్రసంగాలు పూర్తి చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ గత పరిపాలన విధానాలను ఎండగట్టారు. అయితే కేసీఆర్ ప్రసంగాలపై వివిధ పార్టీల నాయకులు, విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. ఒక్కసారిగా కేసీఆర్ లో ఈ మార్పేమిటని అనుమానాలు వ్యక్తం చేస్తు్న్నారు. అయితే బీజేపీ నాయకులు మాత్రం తమ పార్టీ పేరెత్తలేదని బాగా ఫీలవుతున్నారట. బీజేపీ ప్రస్తావన తెస్తే తాము కూడా ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇచ్చవాళ్లమని లోలోపల గొణుక్కుంటున్నారట. కానీ పైకి ఏమీ అనలేకపోతున్నారు బీజేపీ నాయకులు.
హైప్ ఇచ్చి.. పట్టించుకోవడం లేదు..
తెలంగాణలో బీజేపీకి మైలేజ్ రావడానికి కారణం కేసీఆర్. బీజేపీనే తమ ప్రధాన ప్రత్యర్థి అనే భావనను ఎక్స్పోజ్ చేశారు. అదే పనిగా టార్గెట్ చేసి కమలం పార్టీపై విమర్శలు గుప్పించారు. దీంతో రాష్ర్టంలో అధికార, ప్రతిపక్ష పార్టీలుగా బీఆర్ఎస్, బీజేపీ అనే భావవ ఏర్పడింది. ప్రధానంగా పోటీ ఈ రెండు పార్టీల మధ్యే ఉంటుందనే స్థాయికి తెచ్చారు. కాంగ్రెస్ ను మూడో పక్షంగా మారిపోయింది.
రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతుంటే కాంగ్రెస్ ను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. బీజేపీ కి హైప్ ఇవ్వడంలో కేసీఆర్ పాత్ర ఉందని రాజకీయ వర్గాల్లో టాక్. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. బీజేపీపై యుద్ధం ప్రకటించి ఆ పార్టీ పేరెత్తడం లేదు. ఓ వైపు బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందాలని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నది. దీంతో కాషాయం పార్టీలో చేరికలు లేకుండా పోయాయి. ఎన్నికలకు ముందు కమలం పార్టీని పట్టించుకోకపోవడంతో ఇప్పటి వరకూ వచ్చిన హైప్ అంతా కరిగిపోతున్నట్లుగా మారుతున్నది.






