Poor to Rich : ఏపీలో ఎన్నికలకు మరో పది నెలల గడువే మిగిలి ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అధికార వైసీపీలో గెలుపు ధీమా నిండుగా కనిపిస్తున్నది. దేశంలో ఎక్కడా అమలు కాని పథకాలను వైఎస్ జగన్ ఏపీలో అమలు చేస్తున్నారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని మరింతగా అక్కడ పథకాలను ప్రవేశ పెడుతున్నారు. అయితే ఈ పథకాలే తమను గెలిపిస్తాయని సీఎం జగన్ తో సహా వైసీపీ శ్రేణులంతా భావిస్తున్నారు. రాష్ర్ట అభివృద్ధిని పట్టించుకోని ప్రజలు కేవలం సంక్షేమ పథకాల వైపే మొగ్గు చూపుతారని వారు భావిస్తున్నారు.
అయితే ఇక ఏపీలో ప్రధాన పక్షం కూడా సంక్షేమ పథకాల వైపే దృష్టి ఉంటుంది. 2024 తాము అధికారంలోకి వస్తే వైసీపీ కంటే ఎక్కువగానే ఇస్తామని చెబుతున్నది. రాజమండ్రిలో మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన పథకాలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నది. అయితే ఇక్కడ చంద్రబాబు మరో కొత్త ప్రకటన ద్వారా ప్రజల్లో చర్చకు తెరలేపారు. పూర్ టు రిచ్ అనే కార్యక్రమం గురించే ఇప్పుడు చర్చ సాగుతున్నది. అయితే గతంలోనూ చంద్రబాబు పలు పథకాలతో ప్రజల్లోకి వెళ్లారు. కానీ అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోలేదన్న ఆపవాదు మూటగట్టకున్నారు.
మరి ఈసారి పూర్ టూ రిచ్ కార్యక్రమం కూడా వంచనకేనని మాటలు వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పీ4 ట్యాగ్ లైన్ తో దీనిని అమలు చేస్తామని టీడీపీ చెబుతున్నది. కేవలం జగన్ ను ఓడించే లక్ష్యంతోనే అయితే ఈ హామీని నెరవేర్చడం ఏపీలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అసాధ్యమే. నిధుల కొరతతో సంక్షేమ పథకాల అమలే కష్టసాధ్యంగా ఉంది. మరి పూర్ టూ రిచ్ కార్యక్రమం సత్ఫలితాలను ఇవ్వగలదా.. నిధులు లేవనే సాకుతో పథకాలను పక్కనే పెట్టేస్తే మరో ఐదేళ్లకు గండం ఉండనే ఉంటుంది.
ఆచరణ సాధ్యం కాని పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను మభ్య పెట్టే కంటే అభివృద్ధి గళమెత్తి ప్రజలను చైతన్యం చేస్తే బాగుండేదని సామాజిక, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు లాంటి సీనియర్ నేత కూడా ఇలా సంక్షేమ పథకాలతో రాష్ర్టాన్ని దివాళా దశకు తీసుకెళ్లడం భావ్యం కాదని చెబుతున్నారు.