Jagan meet BJP : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఎప్పుడూ వార్తలో నిలుస్తుంది. ఆయన రాష్ర్ట ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్తుంటారని ప్రత్యర్థి పార్టీల నేతలు ఆరోపిస్తుంటారు. అయితే నిజానికి జగన్ టూర్ ఎప్పుడూ రహస్యంగానే సాగుతుంది. ఆయన బీజేపీ పెద్దలను కలిసే సమయం కూడా ఇందుకు కారణమవుతుంటుంది. కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షాను ఏపీ సీఎం జగన్ ఎప్పుడూ రాత్రి పది తర్వాతే కలుస్తారని ప్రచారం జోరుగా సోషల్ మీడియాలో కొనసాగుతున్నది.
అయితే ఏపీ సీఎం జగన్ మెడకు ఎన్నో కేసులు ఉన్నాయి. ప్రస్తుతం వాటి ఊసే లేకున్నా పార్టీ ఎంపీ, సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి అంశం ఆయనకు తలనొప్పిలా మారింది. పార్టీ కి పెద్ద చేటు చేసే అవకాశం ఉన్నది. దీంతో పాటు ప్రస్తుతం రాష్ర్ట ఖజానాలో నిధుల కొరత వేధిస్తున్నది. సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగుల జీతాలు కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ కేంద్రానికి తలొగ్గక తప్పడం లేదు.
ఇప్పటికే పోలవరాన్ని పణంగా పెట్టి రాష్ర్టానికి రూ. పది వేల కోట్లు తెచ్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే జగన్ తాజా పర్యటన కూడా రాష్ర్ట ప్రయోజనాలకు కాకుండా రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల మేరకే సాగిందని టీడీపీ, జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్ తో పాటు పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దీంతో పాటు ఢిల్లీ బీజేపీ పెద్దలు నరేంద్రమోదీ, అమిత్ షా తదితరులతో ఆయన భేటీ అయినట్లు సమాచారం.