
Jagan Tweet : తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడంపై వైఎస్ జగన్ స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని, చంద్రబాబు నియంతలా దాదాపు పూర్తి కావొచ్చిన వైసీపీ కార్యాలయాన్ని కూల్చి వేయించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం కనుమరుగైపోయాయని ట్వీట్ చేశారు.
‘‘ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు.
ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను’’ అని మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు.