
Kangana Case : చండీగఢ్ ఎయిర్ పోర్టులో మండి ఎంపీ, నటి కంగనా రౌనత్ ను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపపై కొట్టింది. దీనిపై పెద్ద దుమారమే రేగుతోంది. ఈ చర్యపై ఎయిర్ పోర్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కుల్విందర్ కౌర్ కు రైతు సంఘాలు మద్దతు పలికాయి. తాము మహిళా కానిస్టేబుల్ కు మద్దతిస్తామని శుక్రవారం (జూన్ 7)న ప్రకటించాయి. దీనిపై పూర్తి దర్యాప్తు చేయాలని వారు కోరుతున్నారు.
సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కు సంయుక్త కిసాన్ మోర్చా-ఎస్కేఎం (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా మద్దతిస్తున్నారు. ఎస్కేఎం (నాన్ పొలిటికల్) నాయకుడు జగ్జీత్ సింగ్ దలేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వాన్ సింగ్ పంధేర్ పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ను కలిసి ఈ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు జరపాలని, కానిస్టేబుల్ కు అన్యాయం జరగకూడదనే తాము మద్దతిస్తున్నట్లు చెప్పారు. అయితే అధికారులు కూడా దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
పంజాబ్ లో అన్ని మతాలకు చెందిన వారు కలిసి మెలిసి ఉన్నారన్న వారు బీజేపీ ఎంపీ వాడిన పదజాలంపై కేసు నమోదు చేయాలని, కోర్టులు సుమోటోగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంగనా రనౌత్ నటి అని, ఇప్పుడు ఎంపీగా ఉన్నప్పటికీ ఆమె అలాంటి భాష మాట్లాడకూడదన్నారు. ఇది ఖండించదగినది. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Shocking rise in terror and violence in Punjab…. pic.twitter.com/7aefpp4blQ— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) June 6, 2024
కంగనా ఈ ఘటనపై తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో సెల్ఫ్ మేడ్ వీడియోలో మాట్లాడారు. ‘ఆమె నా ముఖంపై కొట్టింది, నన్ను ధూషించడం ప్రారంభించింది. ఎందుకిలా చేశావని అడిగానని, రైతుల నిరసనలకు తాను మద్దతిస్తున్నానని చెప్పారు. తాను క్షేమంగానే ఉన్నానని, అయితే పంజాబ్ లో ఉగ్రవాదం, తీవ్రవాదం పెరిగిపోతున్నాయని దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి?’ అని చెప్పింది. ‘పంజాబ్ లో ఉగ్రవాదం, హింస విపరీతంగా పెరిగాయి’ అని క్యాప్షన్ ఇచ్చింది.
రూ.100 లేదా రూ.200 తీసుకొని రైతులు ఢిల్లీలో నిరసన తెలుపుతున్నారని కంగనా గతంలో చేసిన ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ సమయంలో నిరసన కారుల్లో కుల్విందర్ కౌర్ తల్లి కూడా ఉన్నారు. అందుకే కంగనా వ్యాఖ్యలపై కుల్విందర్ చెంపదెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది. అయితే కౌర్ పై ఐపీసీ సెక్షన్ 323 (ఉద్దేశపూర్వకంగా గాయపరిచినందుకు శిక్ష), 341 (తప్పుడు సంయమనం కోసం శిక్ష) కింద కేసు నమోదు చేశారు.