
Lady Aghori Arrest : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరి-వర్షిణి ఉదంతం కీలక మలుపు తిరిగింది. అఘోరి మొదటి భార్యగా చెప్పుకుంటున్న రాధిక ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ పోలీసులు ఉత్తరప్రదేశ్లో లేడి అఘోరిని అరెస్ట్ చేశారు. అఘోరితో పాటు అతడిని పెళ్లి చేసుకున్న శ్రీ వర్షిణిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ ప్రస్తుతం హైదరాబాద్కు తరలిస్తున్నట్లు సమాచారం.
గత కొంతకాలంగా అఘోరి, బి.టెక్ విద్యార్థిని వర్షిణి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వీరిద్దరి సంబంధంపై పలు అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో, రాధిక అనే మహిళ తాను అఘోరి మొదటి భార్యనంటూ తెరపైకి వచ్చారు. అఘోరి తనను మోసం చేశారని ఆరోపిస్తూ మోకిలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా, అఘోరి – వర్షిణి ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లు గుర్తించిన తెలంగాణ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. రాధిక ఫిర్యాదుతో పాటు, అఘోరిపై వచ్చిన ఇతర ఆరోపణలు, ముఖ్యంగా ఒక మహిళా నిర్మాత వద్ద డబ్బు తీసుకుని మోసం చేశారన్న ఫిర్యాదుపైనా పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
అఘోరి అసలు పేరు శ్రీనివాస్ అని, అతడి అఘోరి వేషధారణపై కూడా అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అఘోరి అఖారా కూడా ఇతడిని అఘోరిగా గుర్తించలేదని వార్తలు వచ్చాయి. మరోవైపు, వర్షిణి తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెను అఘోరి మోసం చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం అరెస్టయిన అఘోరి – వర్షిణిని హైదరాబాద్కు తీసుకొచ్చే ప్రక్రియ జరుగుతోంది. హైదరాబాద్కు చేరుకున్న తర్వాత వారిని పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఈ అరెస్టుతో అఘోరి-వర్షిణి వ్యవహారంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.