Lokesh : టీడీపీ యువనేత లోకేశ్ యువగళం పాదయాత్రను నాలుగు రోజుల విరామం అనంతరం మంగళవారం మళ్లీ ప్రారంభించారు. మహానాడు సందర్భంగా ఆయన పాదయాత్రకు నాలుగు రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. అయితే సోమవారం సాయంత్రం ఆయన తిరిగి కడప ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి పాదయాత్ర బ్రేక్ చేసిన ప్రాంతానికి చేరుకున్నారు.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రస్తుతం యువనేత లోకేశ్ పాదయాత్ర కొనసాగుతున్నది. ఈనెల 23 న ఆయన ఈ నియోజకవర్గంలోకి ప్రవేశించారు. 24, 25 తేదీల్లో పాదయాత్ర కొనసాగించారు. మహానాడు సందర్భంగా ఆ తర్వాత బ్రేక్ ఇచ్చారు. కాగా రాజమండ్రిలోని మహానాడులో పాల్గొన్నారు, తిరిగి సోమవారం సాయంత్రం జమ్మల మడుగుకు చేరుకున్నారు. ఆయన ఇప్పటి వరకు 110 రోజుల్లో 1425 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
ఈ రోజు జమ్మలమడుగులో పాదయాత్ర మొదలు కానుంది. టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను ఇకపై పాదయాత్రలో భాగంగా విస్తృతంగా ప్రచారం చేయాలని లోకేశ్ భావిస్తున్నారు. దసరాలోగా రెండో మెనిఫెస్టో తెచ్చి మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధినేత భావిస్తున్నారు. కాగా, యువనేత లోకేశ్ పాదయాత్ర అనూహ్య స్పందన వస్తుండడంతో, ఇటు టీడీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తున్నది.
అయితే 2024 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు యువనేత లోకేశ్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. తాను పర్యటిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని అంచనా వేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మరోవైపు పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మ టీమ్ కూడా ఆయనకు ఎప్పటికప్పుడూ టచ్ లో ఉంటూ ఇవ్వాల్సిన ఫీడ్ బ్యాక్ ఇస్తున్నది.
అయితే రానున్న రోజులు కీలకం కావడంతో స్పీడ్ మరింత పెంచాలని లోకేశ్ భావిస్తున్నట్లుగా సమాచారం. భుజం నొప్పి వేధిస్తున్నా పాదయాత్రను కొనసాగించేందుకే ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెబుతున్నా ఆయన ప్రజల్లో ఉండేందుకే నిర్ణయించుకున్నారు.