
politics : జాతీయ రాజకీయాల్లో తాము కీలకంగా వ్యవహరించబోతున్నామని పదేపదే చెబుతున్నా సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్క మహారాష్ర్ట తప్ప మరో రాష్ర్టం వైపు దృష్టి సారించడం లేదు. గత ఐదేళ్లుగా ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ అంటూ 2018 నుంచి చెప్పుకొస్తున్నారు. ఏడాది క్రితం టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు. అయితే ఇప్పటిదాకా మహారాష్ట్రపై తప్ప మరో రాష్ట్రంపై కేసీఆర్ దృష్టి పెట్టడం లేదు. తరచూ మహారాష్ర్ట నాయకులతో సంప్రదింపులు, చేరికలు తప్ప ఇంకోటి కనిపించడం లేదు. అయితే కేసీఆర్ సంకీర్ణ రాజకీయాలనే నమ్ముతున్నట్లు కనిపిస్తున్నది.
ఏ కూటమిలో ఉండకుండా తటస్థంగా ఉంటున్నారు. రేపు రెండు కూటములకు సరైన మెజార్టీ రాకుంటే తమకు ప్రాధాన్యం దక్కుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఇందుకు మహారాష్ర్టను ఎంచుకున్నారు. ఇక్కడ రాజకీయ అస్థిరత లాభించే అంశం. ఇప్పటికే శివసేన రెండుగా చీలిపోగా, మొన్నటి కి మొన్న ఎన్సీపీ కూడా రెండు చీలిపోయింది. ఈ అస్థిరతను కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలో మహారాష్ర్ట మీద దృష్టి పెడితే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు.
అందుకు మహారాష్ట్ర సీట్లపైనే గురి పెట్టారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర రాజకీయాలపైనా కేసీఆర్ ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అక్కడ్నుంచి చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ భవన్ లో రోజూ చేరికలు ఉండేవి. అలాంటి తరహాలో వారానికో సారి ఓ బ్యాచ్ లీడర్లు వచ్చి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ లో చేరికలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్ర, తెలంగాణల్లో వచ్చే సీట్లతో… కేంద్రం మెడలు వంచుతామని, మహారాష్ట్రను అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. పార్లమెంట్ లో .. తెలంగాణలో వచ్చే బలం బీఆర్ఎస్కు సరిపోదని మరింత అదనపు బలం కోసం మహారాష్ట్రను గురి పెట్టారని రాజకీయవర్గాలు అంచనాకు వచ్చాయి.
మహారాష్ట్రలో కేసీఆర్ సీట్లు సాధిస్తారో లేదో కానీ.. ఆయన మాత్రం కేంద్రంలో చక్రం తిప్పేందుకు ప్లాన్ వేసుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కనీసం 30 సీట్లు సాధిస్తే… సంకీర్ణం వస్తుందని తాము ఎవరికి మద్దతు ఇస్తే వారే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని, కాలం కలసి వస్తే తమకే అతి పెద్ద ప్రాంతీయ పార్టీ కూటమి మద్దతు ఇస్తుందని సీఎం కేసీఆర్ అంచనా. కేసీఆర్ రాజకీయం మాత్రం.. మొత్తంగా మహారాష్ట్ర కేంద్రంగా మారుతోంది. అక్కడి ప్రజలపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నారు.