
SBI ATM : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి భారీగా నగదు ఎత్తుకెళ్లారు. మంగళవారం తెల్లవారు జామున 2.30 గంటల ప్రాంతంలో మాస్కులు ధరించిన ముగ్గురు దొంగలు తెల్లరంగు కారులో వచ్చి ఏటీఎంలోకి చొరబడ్డారు. గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎం మిషన్ ను కట్ చేసి అందులోని రూ. 24,92,600 నగదును దొంగిలించారు. తొమ్మిది నిమిషాల వ్యవధిలో ముగ్గురు వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు.
అయితే ఏటీఎంను ధ్వంసం చేసిన సమయంలో సెక్యూరిటీ అలారం ముంబైలోని ఎస్బీఐ కార్యాలయ కంట్రోల్ రూంనకు వెళ్లింది. వారు బాల్కొండ పోచంపాడ్ ఏటీఎం సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పోలీసులను సంప్రదించారు. పోలీసులు పోచంపాడ్ లో ఉన్న ఏటీఎంను తనిఖీ చేసి వన్నెల్ (బీ) కూడలిలోని ఏటీఎంకి వచ్చేలోపు దొంగలు చోరీ చేసి పరారయ్యారు.
నిజామాబాద్ నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు, ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి ఘటనా స్థలిని పరిశీలించి చోరీ జరిగిన తీరును ఆరా తీశారు. ఏటీఎం ఛానల్ మేనేజర్ అవధూత నితిన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శంకర్ తెలిపారు.