Meeting of Ministers : బీఆర్ఎస్ కీలక సమావేశం ఈ రోజు (మే 17, బుధవారం) జరగనుంది. ఈ సమావేశంలో దశాబ్ది వేడుకలపై సీఎం కేసీఆర్ ఎంపీలు, మంత్రులు (Meeting of Ministers), ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను వైభవోపేతంగా జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్రం అంతటా నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది.
వేడుకలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణుల బాధ్యతలతో పాటు ప్రజల్లోకి తీసుకెళ్లే విషయాలపై కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు.
తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలన, తెలంగాణ వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరుల త్యాగాలు, దశాబ్ధాల పోరాటాన్ని స్మరించుకునేలా కార్యక్రమాలు రూపొంచాలని గులాబీ బాస్ ఆదేశించినట్లు వినికిడి. ఇందులోనే కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యత పథకాలు, వాటితో ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరించి పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, వాటితో ప్రజలకు కలిగిన మేలును వివరిస్తూ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ కేడర్ ను ఆయన సమాయత్తం చేస్తున్నారు. ఈ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లోనే సంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, ఇతర సంబురాలు కూడా ఘనంగా నిర్వహించాలని గులాబీ పార్టీ శ్రేణులకు సూచించారు. నిజాం కళాశాల మైదానం, ఎన్టీఆర్ స్టేడియం, ఎల్బీ స్టేడియం వీటిలో ఏదో ఒక చోట భారీ సభ పెట్టాలని కూడా బాస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అమర వీరుల స్మారక స్తూపం కూడా వైభవంగా ప్రారంభించాలని అనుకుంటున్నారు.