Elephant Viral Video : ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించింది లేదు. అందుకే మన పెద్దలు ముందుగా తల్లికే ‘మాతృదేవోభవ’ అని అభివందనం చేయాలని అన్నారు. మిగిలిన వారందరూ తల్లి తర్వాతే. అమ్మ పంచే ఆప్యాయత, అమ్మ చూపించే అనురాగం, అమ్మ కురిపించే ప్రేమాభిమానాలు మరెవరూ చూపించలేరు. లోకంలో అమ్మ ప్రేమను మించి విలువైంది ఏదీ లేదు. అలాంటి తల్లి తన బిడ్డల కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడుతుంది. ఎంతటి కష్టాలకైనా ఓర్చుకుంటుంది.
మనిషుల్లోనే కాదు జంతువుల్లోనూ తల్లి ప్రేమ ఒకేరకంగా ఉంటుంది. కోడి తన పిల్లలను ఎత్తుకెళ్లేందుకు గద్ద ప్రయత్నిస్తే.. దాని ప్రాణాలకు తెగించి పోరాడి ఆ పిల్లలను కాపాడుకుంటుంది. అలాగే మిగతా జంతువులు కూడా తమ పిల్లలు సొంతంగా ఆహారాన్ని సేకరించుకునేదాక వాటిని కంటికి రెప్పలా చూసుకుంటాయి. ఆహారాన్ని అందిస్తాయి. ఇక మనుషుల్లోనైనా, జంతువుల్లోనైనా తమ పిల్లలు కనిపించకుండా పోతే తల్లి పడే ఆవేదన అంతా ఇంతా ఉండదు. మళ్లీ తన పిల్లలు కనిపించేంత వరకు తల్లి మనస్సు విలవిలలాడుతూనే ఉంటుంది.
ఇలాగే ఓ ఏనుగు తన బిడ్డ ఏనుగు కనిపించకుండా పోతే ఎంతగా విలవిలలాడిందో, తర్వాత తన బిడ్డ కనిపించగానే ఎంతగా సంబురపడిందో.. తెలియజేసే ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వాయర్ లో ఏనుగులు కూడా భారీ సంఖ్యలోనే ఉంటాయి. పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఏనుగులు అందులోనే ఆహారాన్ని సంపాదించుకుంటూ అక్కడే నివసిస్తుంటాయి. రీసెంట్ గా ఓ పిల్ల ఏనుగు తప్పిపోయి ఆ అడవి నుంచి బయటకు వచ్చింది. దీంతో దాని తల్లి అడవి మొత్తం తిరగడం ప్రారంభించింది. తన బిడ్డ ఆచూకీ కోసం తాపత్రయపడింది. నీరు ముట్టకుండా, తిండి తినకుండా కంటనీరుతో అడవి మొత్తం ఆర్తనాదాలు చేయసాగింది. ఇది అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రూప్ కెమెరాలలో రికార్డు కావడంతో వారికి తెలిసింది. దీంతో అన్నామలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు డ్రోన్ కెమెరాల సహాయంతో ఆ తల్లి ఏనుగు జాడను పసిగట్టడం ప్రారంభించారు. ఇలా రెండు మూడు రోజుల తర్వాత వారి నిరీక్షణ ఫలించింది. ఈలోగా వారి సంరక్షణలో ఉన్న పిల్ల ఏనుగును అత్యంత జాగ్రత్తగా తల్లి వద్దకు చేర్చారు.
తన బిడ్డను చూసిన తల్లి ఏనుగు ఆనందంతో పరవశించిపోయింది. దగ్గరకు తీసుకుని తొండంతో ప్రేమగా నిమురుతూ సంబురంగా తోకను ఊపుతూ చాలా సేపు తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి పిల్ల ఏనుగును తీసుకుని దట్టమైన అడవిలోకి వెళ్లింది. పిల్ల ఏనుగు సంతోషంగా తల్లిని అనుసరించింది.
అటవీశాఖ చేపట్టిన ఈ రెస్క్యూ ఆపరేషన్ వీడియోలను సుప్రియ సాహూ అనే ఐఏఎస్ అధికారి తన ఎక్స్ అకౌంట్ పోస్టు చేశారు. పిల్ల ఏనుగును తల్లి దగ్గరకు చేర్చేందుకు తమ సిబ్బంది రామసుబ్రహ్మణ్యన్, భార్గవ తేజ, మణికంఠన్ అనే అధికారుల ఆధ్వర్యంలో జరిగిందని వివరించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఫారెస్ట్ అధికారులపై నెటిజన్లు ‘‘చాలా మంచి పని చేశారు..సార్’’, ‘‘తల్లిని, బిడ్డను కలిపిన మానవతా మూర్తులు సార్’’ అంటూ కొనియాడుతున్నారు.
The year ends on a heartwarming note for us at TN Forest Department, as our Foresters united a lost baby elephant with her mother and the herd after rescue in the Anamalai Tiger Reserve at Pollachi. The little calf was found searching for the mother when field teams spotted her.… pic.twitter.com/D44UX6FaGl
— Supriya Sahu IAS (@supriyasahuias) December 30, 2023