
Hyper Aadi : ఏపీ ఎన్నికల్లో విజయం తర్వాత పీపుల్స్ మీడియా నిర్వహించిన విజయోత్సవ సభలో హైపర్ ఆది ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. పవన్ కల్యాణ్ పిఠాపురంలో విజయం సాధించిన తర్వాత ప్రతి జనసైనికుడి కళ్లలో నీళ్లు తిరిగాయని.. ఎందుకంటే ఆ విజయం కోసం పదేళ్లుగా వేచి చూశామని ఆది అన్నారు. ఒక తండ్రికి కొడుకుకు బైక్ కొనిస్తే ఆ తండ్రి కళ్లలో తిరిగే కన్నీళ్లలాగా.. కొత్తగా ఉద్యోగం వచ్చి న కొడుకు తల్లికి చీర కొనిస్తే వచ్చే ఆనందం.. పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే జన సైనికులకు వచ్చిందని అన్నారు.
పవన్ కల్యాణ్ 10 సంవత్సరాలుగా పార్టీ పెట్టి చేసిన త్యాగాలు మరువలేనివన్నారు. ముఖ్యంగా పవన్ ప్రసంగించిన అన్ని సభల్లో జన సైనికులు సీఎం సీఎం అంటూ ప్రసంగిస్తే ముందు ఎమ్మెల్యే గెలవండని హేళన చేసిన వారు.. ఒక్కసారి ఇటు వైపు చూడండి. మా అన్న పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు అంటూ విమర్శకుల నోళ్లు మూయించాడు.
పదేళ్లుగా పార్టీ కోసం ప్రజల కోసం త్యాగాలు చేసిన ఘనత పవన్ కల్యాణ్ కే దక్కుతుందన్నారు. ఎన్నో అవమానాలు, హేళనలు, చీదరింపులు ఎదుర్కొని ముఖ్యంగా ఓటమిని విజయంగా మార్చుకున్న తర్వాత అసలైన ఆనందం కలుగుతుందన్నారు. నిజంగా మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందన్నాడు. ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటానని నాది ఆంధ్రప్రదేశ్ నేను డిప్యూటీ సీఎం తాలూకా అని అన్నాడు.
లంక దహనం తర్వాత హనుమంతుడు వెళ్లి శ్రీరాముడి పాదాలు పట్టుకున్నట్లు ఏపీలో దుర్మార్గపు పాలన అంతమై ఈ పవనుడు గెలిచి తన అన్న కాళ్లకు నమస్కరించినపుడు కలిగిన అనుభూతి మాటల్లో వర్ణించలేనిదన్నాడు. ఇంతకంటే జీవితంలో మరోక ఎమోషనల్ మూవ్ మెంట్ ఉండదని హైపర్ ఆది అన్నాడు. రాజకీయాల్లో చరిత్రలో పవన్ కల్యాణ్ పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పాడు.