NDA Victory Car Rally 2024 : ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడం పై దేశవిదేశాల్లో తెలుగు తమ్ముళ్ల సంబరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికాలోనైతే ఈ సంబరాలు పీక్స్ లో జరుగుతున్నాయి. జగన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించిన సందర్భంగా అమెరికా ఎన్ఆర్ఐలు గత నాలుగు రోజులుగా సంబరాలు జరుపుకుంటూనే ఉన్నారు.
న్యూజెర్సీ ఎడిసన్ సిటీలోని జాన్సన్ పార్క్ లో యూబ్లడ్ ఫౌండర్ డాక్టర్ జై జగదీశ్ యలమంచిలి గారి ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు ఎన్డీఏ విక్టరీ సెలబ్రేషన్స్ ను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ విక్టరీ కార్ ర్యాలీ తీశారు. దీనికి న్యూజెర్సీలో స్థిరపడిన వందలాది టీడీపీ, జనసేన అభిమానులు హాజరయ్యారు. ర్యాలీలో జై టీడీపీ…. జైజై చంద్రబాబు… జై జనసేన…జై జై పవన్ కల్యాణ్ అంటూ పెద్దఎత్తున నినాదాలతో హోరెత్తించారు.
ర్యాలీ అనంతరం యూబ్లడ్ ఫౌండర్ డాక్టర్ జై జగదీశ్ యలమంచిలి గారు భారీ కేక్ ను కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ..జగన్ రెడ్డి పాలన అంతమవుతుందని తాను ఆరు నెలలు ముందుగానే చెప్పానన్నారు. ఏపీ భవిష్యత్ కు చంద్రబాబు, భారత్ భవిష్యత్ కు మోదీ అవసరమని ప్రజలు మరోసారి గుర్తించారన్నారు. టీడీపీ కూటమి ఘన విజయంలో మూడు పార్టీలకు చెందిన నేతలు, నాయకులు, కార్యకర్తలు..ఇలా అందరి విశేష కృషి ఉందన్నారు. అలాగే మన ఎన్ఆర్ఐల పాత్ర విశేషంగా ఉందన్నారు.
కాగా, వేడుకలను చూస్తే ఆంధ్రాలో ఉన్నామా? అమెరికాలో ఉన్నామా? అనిపించడం ఖాయం. చంద్రబాబు మరోసారి సీఎం అవుతుండడంతో ప్రతీ ఒక్కరి కళ్లలో ఆనందం కనిపిస్తోంది. టీడీపీ కూటమి ఘన విజయం సాధించడం, కేంద్రంలో చంద్రబాబు మరోసారి కింగ్ మేకర్ గా అవతరించడంతో ఏపీకి మంచి రోజులు వచ్చాయని ఎన్ఆర్ఐలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Image Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director)
More Images : NDA Victory Car Rally 2024 at Johnson Park Piscataway NJ