
Nepal Vs Netherlands : టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా డల్లాస్ లోని గ్రాండ్ ప్రారీ స్టేడియంలో జరిగిన ఏడో మ్యాచ్ లో నేపాల్ పై నెదర్లాండ్ జట్టు ఘన విజయం సాధించింది. నెదర్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన నేపాల్ కు ఓపెనర్లు ఇద్దరు తక్కువ స్కోరు కే అవుటయ్యారు. వన్ డౌన్ లో వచ్చిన అనిల్ సాహు, కెప్టెన్ రోహిత్ పౌడేల్ ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
రోహిత్ పౌడేల్ 35 పరుగులు చేయగా.. అనిల్ సాహు 11 పరుగులకే అవుటయ్యాడు. నెదర్లాండ్ బౌలర్లలో వాన్ బీక్, టిమ్ ప్రింగిల్ చెరో మూడు వికెట్లు తీయగా.. బాస్ డీ లీడ్, వాన్ మీకరన్ రెండేసి వికెట్లు తీసి నేపాల్ పతనాన్ని శాసించారు. దీంతో నేపాల్ 19.2 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది.
సెకండ్ ఇన్సింగ్స్ లో 107 పరుగుల ఛేజింగ్ తో బరిలోకి దిగి 15 ఓవర్లలోనే ఛేజ్ చేసేసింది. నెట్ రన్ రేట్ కూడా మెరుగుపర్చుకుంది. ఓపెనర్ మ్యాక్సీ డీడౌట్ 54 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ గెలిపించాడు. విక్రమ్ జిత్ సింగ్ 22 పరుగులు, ఇంగిల్ బ్రీత్ 14, బాస్ డీ లీడ్ 11 పరుగులతో రాణించారు. దీంతో మరో అయిదు ఓవర్లు మిగిలి ఉండగానే నెదర్లాండ్ టార్గెట్ ను చేజ్ చేసింది.
నేపాల్ బౌలర్లలో సోంపాల్, దేవేంద్ర, అవినాష్ లు చెరో వికెట్ తీసుకున్నారు. నేపాల్ కు అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. బ్యాటింగ్ లో నలుగురు మినహా ఎవరూ కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయకపోవడం, మిగతా బ్యాటర్లందరూ చేతులెత్తేయడంతో తక్కువ స్కోరుకే పరిమితమై ఓడిపోవాల్సి వచ్చింది. కనీసం ఈ పిచ్ పై 150 నుంచి 160 చేసుంటే విజయం సాధించే అవకాశం ఉండేది.