Lokesh padayatra Poddutour : నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆయనపై కొందరు కోడిగుడ్లు విసిరారు. అయితే ఆ గుడ్లు లోకేష్ సెక్యూరిటీ సిబ్బందికి తగిలాయి. దీంతో లోకేష్ సెక్యూరిటీ అప్రమత్తమైంది. ప్రొద్దుటూరు శివాలయం సెంటర్లో బహిరంగ సభ ముగించుకొని ఆర్టీసి బస్టాండ్ దాటిన తరువాత ఓ దుకాణం వద్ద ఆగి స్థానికులతో మాట్లాడుతుండగా కొందరు కోడిగుడ్లు విసిరారు. లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రొద్దుటూరులో సుమారు 500 ల మందికి పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు. అయినా లోకేష్ పై కోడిగుడ్లతో దాడి జరగడంపై టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఇది పోలీసుల వైఫల్యమేనని టీడీపీ అగ్రనేతలు మండిపడుతున్నారు.
ఈ ఘటనపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిని టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టగా వారి నుంచి పోలీసులు అతడిని రక్షించి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గురువారం ఉదయం చౌటపల్లి క్యాంప్ సైట్ నుంచి 113వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్… సాయంత్రం 6 గంటలకు ప్రొద్దుటూరుకి చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.
అయితే టీడీపీ అధినేత పాల్గొనే బహిరంగ సభల్లోనూ ఇలాగే దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఎర్రగొండపాలెంలో టీడీపీ నిర్వహించిన బహిరంగ సభలో రాళ్ల దాడి జరుగగా ఓ కార్యకర్త కు గాయాలయ్యాయి. కొద్దిరోజుల పాటు చికిత్స పొంది చనిపోయాడు. చంద్రబాబు రోడ్ షోలు, సభల్లోనూ వైసీపీ నాయకులు అల్లర్లు సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందకు టీడీపీ కార్యక్రమాల్లో అల్లర్లకు పాల్పడుతున్నది. దీంతో శాంతి భద్రతల సమస్యను బూచిగా చూపించి టీడీపీ కార్యక్రమాలకు అనుమతి లేకుండా చేయాలని అధికార పార్టీ కుట్రలకు పాల్పడుతున్నదని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు.