
Motkupalli Narasimhulu : ఇతర సీఎంలు ఏపీ సీఎం చంద్రబాబును చూసి నేర్చుకోవాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తన ఫొటోతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటో ఉంచాలని ఆదేశించి తన గొప్ప మనసును చాటుకున్నారని అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బొంకూరి సురేందర్ సన్నీ నూతనంగా ఏర్పాటు చేసిన ‘మాదిగ శక్తి సంఘం’ కరపత్రాన్ని ప్రొఫెసర్ ఖాసంతో కలిసి మోత్కుపల్లి నర్సింహులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో 80 లక్షల జనాభా ఉన్న మాదిగలకు కాంగ్రెస్ టికెట్లు ఇవ్వలేదని, ఏపీలో చంద్రబాబు దామాషా ప్రకారం సీట్లు ఇవ్వడంతో పాటు మంత్రి పదవి ఇచ్చారన్నారు. ఏపీలో కాపులంతా పవన్ వెనుక ఉండడంతోనే పోటీ చేసిన 21 సీట్లు గెలిచారని, ఇప్పుడా కులానికి ఎంతో గౌరవం పెరిగిందన్నారు. తెలంగాణలో మాదిగలు డబ్బులిస్తే ఓటేస్తారన్న లెక్కలేనితనం ఉందని విమర్శించారు. తెలంగాణ క్యాబినెట్ లో మాదిగలకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.