
Pawan and CBN : ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రాజకీయ విశ్లేషకుల అంచనాలకు కూడా అందకుండా రికార్డు విక్టరీ నమోదు చేసింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు ఊపందుకున్నాయి. కూటమిలో పార్టీల శాసనసభాపక్ష నేతల ఎన్నికతో పాటు ఎన్డీయే నేత ఎన్నిక కార్యక్రమాలు నేడు జరుగుతున్నాయి. ముందుగా జనసేన పార్టీ శాసనసభాపక్ష నేతగా పవన్ కల్యాణ్ ఎన్నికయ్యారు.
నేటి ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం జరిగింది. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కల్యాణ్ ను ప్రతిపాదించారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ప్రతిపాదనను బలపరిచారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 164 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. కూటమిలో మిత్రపక్షమైన జనసేన 21కి 21 సీట్లు గెలుచుకుంది. అయితే ఈ నెల 12న ఏపీకి మూడవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు మరికొంతమంది కూటమి ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేసే చాన్స్ ఉంది.
కాసేపట్లో టీడీపీఎల్పీ, బీజేఎల్పీ నేతల ఎన్నికలు, ఆ తర్వాత ఎన్డీయే నేత ఎన్నిక ఉండనున్నాయి. అనంతరం టీడీపీ, బీజేపీ కూడా తమ శాసనసభా పక్ష నేతల ఏర్పాటుకు భేటీలు ఏర్పాటు చేసుకుననాయి. టీడీపీ శాసనసబాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక అయ్యారు. బీజేపీ నుంచి ఈసారి శాసనసభాపక్ష నేతగా ఎవరుంటారన్న దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
సీనియర్ నేతలైన సుజనా చౌదరి, విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణరెడ్డి, కామినేని శ్రీనివాస్ లో ఒకరికి బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అనంతరం విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఎన్డీయే కూటమి పార్టీల ఎమ్మెల్యేలంతా హాజరవుతారు. ఈ భేటీలో ఎన్డీయే కూటమి నేతగా చంద్రబాబును ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఎన్డీయే కూటమి తరఫున చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు గవర్నర్ ను కలిసి మద్దతు లేఖలను సమర్పిస్తారు. దీంతో రేపటి ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి మార్గం సుగమం కానుంది.