
Pawan Kalyan : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం కేతనం ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా దాదాపు 70వేలకు పైగా భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో పడకేసిన అభివృద్ధి పై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో జనసేన శ్రేణులకు జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక సూచనలు జారీ చేశారు. రాష్ట్రంలోని ఎన్డీయే సర్కార్కు జనసేన కార్యకర్తలు, నాయకులు వెన్నుదన్నుగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ క్రమంలోనే తమ పార్టీ శ్రేణులకు హెచ్చరికలు జారీ చేశారు. పార్టీకి చెందిన ఏ ఒక్కరూ తమ ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న తరుణంలో పార్టీలోని ఎవరు మాట్లాడినా, అధికారుల పనితీరుపై ఆధారాలు లేని ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రోటోకాల్ ఉల్లంఘించి అధికారిక సమావేశాలలో పార్టీ నాయకులు గానీ, కార్యకర్తలు గానీ పాల్గొనడం నిబంధనల ఉల్లంఘన అవుతుందన్నారు. అటువంటివారిపై కూడా చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తొలుత షోకాజ్ నోటీసు జారీ అవుతుందన్నారు. నోటీసుకు సంతృప్తికరమైన సమాధానం రాని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మాస్ వార్నింగ్ ఇచ్చారు. అందుకే పార్టీలోని ప్రతి ఒక్కరూ పార్టీ ప్రతిష్ఠను ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరారు.