
Dynamic IAS Officer : పదేళ్ల పాటు ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొని చివరకు అధికారం దక్కించుకున్న వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్. వెండితెరపై పవర్ స్టార్ గా ఎంతో మంది అభిమానులు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలే మార్గమని అందులోకి అడుగు పెట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి ఔరా అనిపించారు. అలాంటి నాయకుడికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం తో పాటు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, పంచాయతీరాజ్, అటవీ-పర్యావరణం,సైన్స్ టెక్నాలజీ మంత్రిత్వశాఖల బాధ్యతలను అప్పగించారు. ఇక చేతిలో ఉన్న ఐదేళ్లలో ప్రజల రుణం తీర్చుకోవాలంటే ఆయనకు మంచి టీం కావాలి. పాలనలో ఆయన అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే సివిల్ సర్వెంట్స్ అధికారులుగా ఉండటం అవసరం. అలా ఓ కత్తిలాంటి ఆఫీసర్ ను పవన్ తన పేచీలోకి తీసుకుంటున్నారు. ఆయనే మైలవరపు కృష్ణతేజ. కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి. తెలుగు వ్యక్తి. ప్రస్తుతం కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్.
కృష్ణతేజానే ఎందుకు పవన్ కళ్యాణ్ ఏరికోరి కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారిని తన పేషీలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారనేది చాలా ఆసక్తికరం. పవన్ కళ్యాణ్ దృష్టిని అంతలా ఆకర్షించేలా కృష్ణతేజ తన ఏడేళ్ల కెరీర్ లో ఎన్ని ఘనతలు సాధించారో తెలుసుకుందాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ 2014 సివిల్స్ ఎగ్జామ్ లో 66ర్యాంకు సాధించారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 2017లో కేరళ క్యాడర్ లో అలెప్పీ జిల్లా సబ్ కలెక్టర్ గా నియమితులై చాలా తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో వచ్చిన కేరళ వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. అలెప్పీ జిల్లాలో ఈ వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. వరదల సమయంలో అలెప్పీ జిల్లాకు సబ్ కలెక్టర్ గా ఉన్న కృష్ణతేజకు పూర్తి స్థాయి అధికారిగా అదే ఫస్ట్ పోస్టింగ్. రైస్ బౌల్ ఆఫ్ కేరళగా పిలుచుకునే కుట్టునాడు ప్రాంతాన్ని వరదలు ముంచెత్తుతాయనే ముందస్తు సమాచారం కృష్ణతేజకు అందింది. అంతగా అనుభవం లేని ఆయన ధైర్యంగా ముందడుగు వేశారు. పై అధికారులకు ఏం జరిగిందో తెలిసే లోపే స్థానిక యువతతో కలిసి 48గంటల్లో రెండున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆపరేషన్ కుట్టునాడు సూపర్ సక్సెస్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. దేశంలోనే అతి సమర్థవంతమైన రెస్య్కూ ఆపరేషన్స్ లో ఒకటిగా ఆపరేషన్ కుట్టునాడు నిలిచింది.
వరదల ప్రభావం తగ్గిన తర్వాత బాధితుల కోసం ఏమైనా చేయాలనే దిశగా ఆలోచనలను ఆయన కొనసాగించారు. ఓ ప్రభుత్వ అధికారిగా గవర్నమెంట్ నుంచి అందే సాయం కోసమే ఎదురుచూస్తూ కూర్చోకుండా ‘ఐయామ్ ఫర్ అలెప్పీ’ పేరుతో ఓ ఫేస్ బుక్ క్యాంపెయిన్ ను ప్రారంభించారు. ఇది ఎంతో మంది కేరళవాసులను ఆకర్షించింది. అలెప్పీ కి తమ వంతు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ఇంటర్నెట్ లో వైరల్ గా మారటంతో వేరే రాష్ట్రాల నుంచి అలెప్పీ కోసం సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈనాడు సంస్థల అధినేత దివంగత రామోజీరావు తన పత్రిక ద్వారా విరాళాలను సేకరించి అలెప్పీలో ఇళ్లను నిర్మించి బాధితులకు అందించాలనే ప్రాజెక్టును చేపట్టారు. ఆ బాధ్యతలను కృష్ణతేజకే రామోజీరావు అప్పగించారు. బాహుబలి టీమ్ ద్వారా రాజమౌళి, యాంకర్ సుమ ఇలా ఎంతో మంది అలెప్పీలో బాధితుల కోసం తరలివచ్చేలా కృష్ణతేజ మాట్లాడి ఒప్పించగలిగారు. పడవలు కోల్పోయిన వారికి జోవనోపాధి కోసం పడవలు, నిత్యావసర సరుకులు, స్కూళ్లను తిరిగి కట్టడం, ఇళ్లు కోల్పోయిన బాధితులకు తిరిగి సొంత ఇంటిని కట్టించి ఇవ్వటం ఐయామ్ ఫర్ అలెప్పీ ఓ ఫేస్ బుక్ సాధించిన విప్లవం అంతా ఇంతా కాదు. యునిసెఫ్ లాంటి సంస్థల దృష్టిని ఆకర్షించి వాళ్లే పేజ్ ను మెయింటైన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆయన అలెప్పీ సబ్ కలెక్టర్ పొజిషన్ నుంచి బదిలీపై కృష్ణతేజ పర్యాటక శాఖకు వెళ్లిపోతున్నట్లు అలెప్పీ వాసులు తల్లడిల్లిపోయారు.
కేరళ అంటేనే పర్యాటకం. అలాంటి పర్యాటక శాఖకు మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన కృష్ణతేజ ఆ శాఖలోనూ తనదైన మార్క్ చూపించారు. మిషన్ ఫేస్ లిఫ్ట్ పేరుతో పర్యాటకులను ఆకర్షించేలా పాడుబడిపోయిన టూరిజం హోటళ్లను మోడ్రనైజ్ చేయించారు. మాయా పేరుతో ఓ చాట్ బోట్ ను క్రియేట్ చేయించి కేరళ టూరిజం కోసం వచ్చే పర్యాటకులను గైడ్ చేసేలా సాంకేతికతను రూపొందించటంలో కృష్ణతేజ సక్సెస్ అయ్యారు. అలెప్పీలో రిసార్టు మాఫియాను తరిమికొట్టారు. కోవిడ్ కారణంగా తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు సెలబ్రెటీల ద్వారా చదువుకు సాయం అందించి అక్కడి పిల్లలకు కలెక్టర్ మామన్ గా పేరు తెచ్చుకున్నారు. ఎంత మంది చిన్నారులు కృష్ణతేజ బొమ్మలు గీసి ఆయనకే ప్రజెంట్ చేశారో లెక్కనే లేదు. నిజాయితీ, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న పవన్ కు కృష్ణతేజ లాంటి అధికారి తోడు అయితే మరిన్ని అద్భుతాలు చేయడం ఖాయం.