
PM Modi Birthday Special : ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు వేడుకలను బీజేపీ శ్రేణులు, ఆయన అభిమానులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయా చోట్ల పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ప్రధాని మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నదని ఆయా చోట్ల నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ర్టాల్లోనూ మోదీ బర్త్ డేను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
ఇక విజయవాడలోనూ మోదీ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. యూ బ్లడ్. కామ్ ఫౌండర్ యలమంచిలి జగదీశ్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి హాజరయ్యారు. యూ బ్లడ్ యాప్ సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ స్టేట్ మీడియా ఇన్ చార్జి పాతూరి నాగభూషణం కూడా పాల్గొన్నారు. యూబ్లడ్ . కామ్, యాప్ ద్వారా ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తం అందుబాటులోకి తెస్తున్న విధానాన్ని ఆయన వివరించారు. మాన్యప్రధాన మంత్రి జన్మదినం సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా యూ బ్లడ్ తన సేవలను విస్తృతం చేస్తూ ముందుకెళ్తున్నదని చెప్పారు. ఈ సందర్భంగా ఏ ఒక్కరూ రక్తకొరతతో చనిపోకుండా ఉండేందుకే ఈ యూ బ్లడ్ ను ఫౌండర్ జగదీశ్ బాబు యలమంచిలి కొనసాగిస్తున్నారని తెలిపారు.
పెద్ద సంఖ్యలలో యువకులు ఈ మెగా రక్తదానశిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తం అందించేందుకు ఇలాంటి శిబిరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. మోదీ బర్త్ డే సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని, ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు. రక్తదానం చేస్తున్నప్పుడు ఇది మరొకరికి సేవ మాత్రమే కాదని, స్వయాన భగవంతుడికి చేస్తున్న సేవలా భావించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా రక్తదానం చేయాలని, ఎలాంటి అపోహ అవసరం లేదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ ముఖ్య నాయకులు పలువురు పాల్గొన్నారు.