
Tirumala : తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులను ఆటపట్టిస్తూ యూట్యూబర్ చేసిన ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో టీటీడీ చర్యలు తీసుకుంది. కట్టుదిట్టమైన భద్రత, నిఘా ఉన్న చోటికి యువకులు మొబైల్ ఫోన్లు తీసుకొచ్చి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారనే విమర్శలపై టీటీడీ అధికారులు స్పందించారు. బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిబ్బందిని ఆదేశించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను తమిళనాడుకు పంపించారు. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులను ఆటపట్టించేందుకు యువకుడు ఓ ప్రాంక్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొద్ది రోజుల క్రితం తమిళనాడుకు చెందిన యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్ తన స్నేహితులతో కలిసి తిరుమలకు వచ్చాడు. నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్న భక్తులను ఆటపట్టించేందుకు వాసన్ మిత్ర ఈ వీడియోను రూపొందించారు. క్యూ లైన్లో వెళ్తున్న వారి కోసం వేచి ఉన్న కంపార్ట్మెంట్ తాళాలు తీసే ఉద్యోగి మాదిరి నటించాడు.
తాళాలు తీస్తున్నట్లు నటించడంతో నిజమని నమ్మిన భక్తులు ఒక్కసారిగా లేచి కంపార్ట్మెంట్ గేట్లను తెరుస్తారేమోనని భావించి గేట్లవైపు బయలుదేరారు. తర్వాత నవ్వుతూ వెనక్కి పరుగెత్తాడు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో తమిళనాడులో వైరల్గా మారింది. ఈ విషయంపై భక్తుల నుంచి విమర్శలు రావడంతో టీటీడీ చర్యలు తీసుకుంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గురువారం ప్రకటించారు. వాసన్తో పాటు అతడికి సహకరించిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని తమిళనాడుకు పంపించారు.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో క్యూలైన్లలోకి మొబైల్ ఫోన్ ఎలా వచ్చిందనే అనుమానాలు తలెత్తాయి. ఈ వీడియో టీటీడీ భద్రతా లోపాలను బయటపెట్టింది. శ్రీవారి దర్శనానికి క్యూలైన్లలో ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. దీనిపై విచారణ చేపట్టిన టీటీడీ.. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చిలిపి వీడియోలు చేయడం హేయమైన చర్య అని ఒక ప్రకటనలో ఖండించింది.