
Priyanka Gandhi : రానున్న కేరళలోని వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రియాంకకు మద్దతుగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రచారం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్ బరేలీ, వయనాడ్ లలో పోటీచేసి రెండు స్థానాల్లోను భారీ మెజారిటీతో గెలుపొందారు. రెండు స్థానాల్లో గెలిచినవారు ఒక స్థానాన్ని వదులుకోవాలనే నియమం ప్రకారం ఆయన వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఈ స్థానంలో ప్రియాంక పోటీకి దిగుతున్నారు. 2019 నుంచి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ప్రియాంక ఇప్పటి వరకు ఏ స్థానంలోనూ పోటీ చేయలేదు. కాంగ్రెస్ పై అభిమానం చూపుతున్న వయనాడ్ లో ఆమె తొలిసారి పోటీ చేస్తే కచ్చితంగా విజయం సాధిస్తారని హస్తం పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.
లోక్ సభ ఎన్నికల సమయంలో పశ్చిమబెంగాల్ లో సీట్ల పంపకంపై విభేదాల కారణంగా మమతా బెనర్జీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీలోకి దిగారు. అయితే, ఈ రెండు పార్టీలు జాతీయస్థాయిలో ఇండియా కూటమిలో భాగంగా కలిసి పనిచేశాయి. వయనాడ్ నుంచి బరిలోకి దిగిన ప్రయాంక గాంధీ తరపున స్వయంగా ప్రచారం చేసేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంగీకరించినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ సెక్రటేరియట్ లో సీఎం మమతతో కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం సమావేశమైన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది.