
Priyanka Gandhi : తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు కొత్త పేరు వినిపిస్తుంది. ఆ పేరే ప్రియాంకా గాంధీ. దాదాపు పదేళ్లుగా ప్రభుత్వానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఊపుమీద ఉంది. ఈ సారి ఎలాగైనా ప్రభుత్వం తమదే కావాలని శతవిధాల ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే 8న హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో ‘నిరుద్యోగ యువగర్జన’ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరవుతుంది. ఈ వేదిక నుంచి ‘యూత్ డిక్లరేషన్’ ఇవ్వనున్నారు ప్రియాంక. గతంలో ఆమె చాలా సార్లు తెలంగాణకు వచ్చినా సభలు, ప్రచారాల్లో మాత్రం పాల్గొనలేదు.
ఏఐసీసీ సభ్యురాలిగా ప్రస్తుతం ప్రియాంకా గాంధీ కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రియాంకా గాంధీ దక్షిణాది బాధ్యతలను తీసుకోబోతున్నారు. గతంలో ఉత్తరాధి బాధ్యతలు తీసుకున్న ఆమె ఇప్పుడు దక్షిణ భారతదేశంపై దృష్టి సారిస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఇలా అన్ని రాష్ట్రాల్లో పట్టుకోసం పావులు కదుపుతున్నారు. తెలంగాణ ఇన్ చార్జి బాధ్యతలు చేపట్టే అకాశం ఉంది. ఇది అధికారికంగా కాకపోయినా అనధికారికంగా మాత్రం ఆమె బాధ్యతలు చేపట్టినట్లే అంటూ తెలుస్తోంది.
కాంగ్రెస్ లో సీనియర్ల గురించి చెప్పుకోవాలంటే వారంతా రాజకీయ ఉద్ధండ పండితులనే చెప్పుకోవాలి. వారి జీవితకాలం కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారే ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఇటీవల టీపీసీసీ బాధ్యతలు రేవంత్ కు ఇవ్వడంతో వారంతా గుస్సాగా ఉన్నారు. అయితే సోనియా గాంధీ అన్నా.. ఆమె కుటుంబ సభ్యులన్నా ఇక్కడి సీనియర్ నాయకులకు వల్లమాలిన అభిమానం ఆమె వారిని ఒక దారికి తేవడంలో సక్సెస్ అవుతుందని ఘంటాపథంగా చెప్పవచ్చు.
తెలంగాణ పాలిటిక్స్ లో ఆమె బీఆర్ఎస్ తో కన్నా బీజేపీతో ఎక్కువగా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ రెండు దఫాలుగా అధికారంలో ఉంటూ.. ప్రస్తుతం పట్టు కోల్పోతుంది. కానీ బీజేపీ మాత్రం వేగంగా పుంజుకుంటుంది. ఇప్పటి వరకూ తెలంగాణను పక్కన బెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది లేదు. కానీ ఈ సారి ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా కేంద్ర నాయకత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. అపర చాణక్యుడు అమిత్ షా, మోడీ తంత్రాలను తట్టుకోవడం ఆమె వల్ల కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజకీయాల్లో ఆమెకు ఇప్పటి వరకూ కలిసి రాలేదు. ప్రతక్ష్య రాజకీయాల్లో ఆమె పాత్ర చాలా తక్కువనే చెప్పాలి. గతంలో ఆమెథీలో తల్లి సోనియా గాంధీకి, సోదరుడు రాహుల్ గాంధీ కోసం ప్రియాంకా ప్రచారం చేశారు. ఆ సమయంలో ఆమె ప్రముఖ వ్యక్తిగా నిలిచారు. ఆమె వస్తున్నారంటే జనం అధికంగా వచ్చేవారు. కానీ 2007 ఎన్నికల్లో రాహుల్ గాంధీ నియోజకవర్గం ఆమేథీ, రాయ్ బరేలి సెగ్మెంట్లపై ఆమె ప్రధానంగా దృష్టి పెట్టారు. దాదాపు 20 రోజుల వరకూ అక్కడే ఉండి ప్రచారం నిర్వహించారు. కానీ ఎలాంటి ఫలితం దక్కలేదు. కాంగ్రెస్ అక్కడ తుడిచిపెట్టుకుపోయింది. 402 సీట్లకు గానూ 22 మాత్రమే సాధించింది.
అయితే తెలంగాణలో ఆమె మంచి ఫలితాలు సాధించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ బీజేపీ కంటే కాంగ్రెస్ కు క్యాడెర్ ఎక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆమె తెలంగాణపై దృష్ణి పెడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.






