Rahul Gandhi in America : కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ అమెరికా చేరుకున్నారు. పది రోజుల పర్యటన నిమిత్తం అయన అక్కడికి వెళ్లారు. రాహుల్ గాంధీ వివిధ వర్గాలతో అక్కడ భేటీ కానున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్ని కాంగ్రెస్ శ్రేణులు పూర్తి చేశాయి.
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఇటీవల భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు ఊపు తెచ్చారు. కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపారు. 2024 ఎన్నికల ముందు ఇది కాంగ్రెస్ పార్టీకి కొత్త బలాన్ని ఇచ్చిందని అందరూ అనుకుంటున్నారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం కాంగ్రెస్ శ్రేణులకు ఊపిరి పోసింది. అయితే ఈ విజయం అనంతరం తొలిసారిగా రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటించబోతున్నారు. అక్కడి న్యూయార్క్ స్క్వేర్ లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.
రాహుల్ తన పర్యటనలో అక్కడి పారిశ్రామికవేత్తలు ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. దేశంలో తాజా పరిస్థితులు, ప్రస్తుత స్థితిగతులు, పార్టీ అంశాలు, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఆవశ్యకత అంశాలపై చర్చించనున్నారు అందుకోసం 6000 మంది ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కాగా రాహుల్ ఈ పర్యటనపై బీజేపీ శ్రేణులు వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టాయి.
కొన్ని వర్గాలకు మద్దతుగానే రాహుల్ అమెరికాలో పర్యటిస్తున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే కాంగ్రెస్ శ్రేణులు మాత్రం దీన్ని ఖండిస్తున్నాయి. కాంగ్రెస్ అనుకూల ప్రవాస భారతీయులతో సమావేశం అవ్వడానికి రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లారని ఇది పూర్తిగా వ్యక్తిగత టూర్ అని చెబుతున్నారు. బీజేపీ విమర్శలను కొట్టి పారేస్తున్నారు.