
Ukraine : ఉక్రెయిన్ పై రష్యా పెద్ద ఎత్తున క్షిపణుల వర్షం కురిపించింది. రాజధాని కీవ్ లోని దేశంలోనే అతిపెద్ద చిన్నారుల ఆస్పత్రిపైనా దాడి జరిగింది. ఈ దాడుల్లో 20 మంది మృతి చెందారు. దాదాపు 50 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. కీవ్ లోని దేశంలోనే అతిపెద్ద చిన్నారుల ఆస్పత్రి ‘ఓఖ్ మాత్ డిత్’ పైన దాడి జరిగింది. నాలుగు నెలల వ్యవధిలో రాజధానిపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే. పేలుళ్ల ధాటికి భవనాలు దద్దరిల్లాయి.
అత్యాధునిక కింజాల్ రాకెట్లను రష్యా ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వాయుసేన ఆరోపించింది. 40కి పైగా క్షిపణులతో తమ దేశంలోని 5 నగరాలను మాస్కో లక్ష్యంగా చేసుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు. పిల్లల ఆస్పత్రి భవనం పాక్షికంగా ధ్వంసమైందని, శిథిలాల కింద చిక్కుకుపోయినవారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.