
Ramoji Rao : ఈనాడు మీడియా సంస్థల అధినేత, మీడియా మొఘల్ రామోజీరావు (88) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. జూన్ 5న ఆయనకు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు ఎదురవడంతో కుటుంబ సభ్యులు నానక్ రామ్ గూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రామోజీరావును పరీక్షించిన వైద్యులు గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు గుర్తించి స్టంట్ అమర్చారు. రెండు రోజులుగా ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్యం శుక్రవారం రాత్రి విషమించింది. శనివారం తెల్లవారు జామున 4.50 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నారు.
1936 నవంబర్ 16నన కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తర్వాత ఆయన జన్మించారు. చిన్నప్పటి నుంచే విలక్షణ, సృజనాత్మకత ఉన్న వ్యక్తి ఆయన. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ‘ఈనాడు’ను ప్రారంభించారు. నాలుగేళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా ‘సితార’ సినీ పత్రిక నిలిచింది.
బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధన, ఇవే రామోజీరావు అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు.. కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతుబిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు.