
Delhi Government : దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో అక్కడి వాటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తాగడానికి నీళ్లు లేక అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా నీరు వృథా చేస్తే రూ.2 వేల జరిమానా విధిస్తామని తెలిపింది.
వాటర్ ట్యాంకులు ఓవర్ ఫ్లో అయినా, మంచినీటితో కార్లు ఇతర వాహనాలు కడిగినా, భవన నిర్మాణాలకు, వాణిజ్య అవసరాలకు నీటిని వాడినా జరిమానా కట్టాల్సిందేనని వాటర్ బోర్డు ప్రకటించింది. నీరు ఎక్కడ వృథా అవుతుందో పరిశీలించడానికి ఢిల్లీ వాటర్ బోర్డుకు చెందిన 200 బృందాలు రంగంలోకి దిగనున్నాయి. వాణిజ్య సముదాయాలు, నిర్మాణంలో ఉన్న భవనాలకు ఉన్న అక్రమ తాగునీటి కనెక్షన్లను తొలగించాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.