New Government : ఏపీలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నెల రోజులు పూర్తయింది. జూలై 12న రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ కొత్త ప్రభుత్వ పాలన గురువారంతో నెల రోజులు పూర్తయింది. ఈ నెల రోజుల్లో కొత్త ప్రభుత్వం గాడి తప్పిన పాలన సరైన మార్గంలో పెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్ల పై కొత్త సర్కార్ దృష్టి పెట్టింది. త్వరలో ఏపీలో గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది.
రూ.4,976 కోట్లు నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. జనాభా 250 మించి ఉన్న ప్రతి గ్రామానికీ రహదారిని అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రంతో మాట్లాడి మ్యాచింగ్ గ్రాంటు 10 శాతానికి తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు విజయవాడ క్యాంపు ఆఫీసుతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అధికారులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు.
గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమని తెలిపారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతోపాటు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయనే విషయాన్ని అందరం గుర్తుంచుకోవాలన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మరింత కోరదామని మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.
గత ప్రభుత్వం హయాంలో బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరిగిందని, దాని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ ప్రక్రియ కుంటుపడిందన్నారు. ఆ సమస్యను పరిష్కరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యతతో కూడిన రహదారులు అందుబాటులోకి వచ్చేవని, తద్వారా అభివృద్ధి సాధ్యపడేదన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం పనుల్లో పారదర్శకతను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో సమీక్షించేందుకు ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేయాలని అధికారులకు పవన్ సూచించారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు వీలుగా ఆ పోర్టల్లో ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలన్నారు.