
Sabharimala Makara Jyothi : సంక్రాంతి పర్వదినం రోజున శబరిమలలో మంగళవారం సాయంత్రం అయ్యప్ప స్వామి మకరజ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మకర జ్యోతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమలకు తరలివచ్చారు. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.
తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక పొన్నంబలమేడు పర్వత శిఖరాల్లో మకరజ్యోతి దర్శనమిచ్చింది. లక్షలాదిగా అయ్యప్పస్వామి భక్తులు మకరజ్యోతి దర్శించుకొని అయ్యప్ప కృపకు పాత్రులయ్యారు. మకర జ్యోతి దర్శనంతో శబరిమల అయ్యప్పస్వామి నామస్మరణతో మార్మోగిపోయింది.
దేవతలు, రుషులు హారతిస్తారనే భక్తుల నమ్మకం..
కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని అయ్యప్ప భక్తుల నమ్మకం. మకర సంక్రాంతి రోజున పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతినిచ్చారు. ఆ వెంటనే క్షణాల్లో చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమిచ్చింది.
అయ్యప్పస్వాములు, భక్తులు మకర జ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ భారీగా ఏర్పాట్లు చేసింది. స్వాములు, భక్తులంతా మకర జ్యోతిని ప్రశాంతంగా దర్శించుకున్నారు. మరోవైపు కోట్లాది మంది భక్తులు టీవీలు, ఇతర ప్రసార మాధ్యమాల్లో మకర జ్యోతిని దర్శించుకొని స్వామివారిని స్మరించుకున్నారు.