
Deputy CM Pawan : పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తను ఏరికోరి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలను ఎంచుకున్న సంగతి తెలిసిందే. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీని స్వచ్ఛతా రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో స్వచ్ఛతను ప్రోత్సహించేందుకు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు.
ముఖ్యంగా పిఠాపురం, భీమవరం నియోజకవర్గాలపై ఆయన ప్రత్యేక దృష్టిసారించారు. రోజురోజుకీ పెరుగుతున్న ఘన, ద్రవ వ్యర్థాల మూలంగా గ్రామాల్లో పర్యావరణ సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తీవ్రతరం అవుతున్నాయని పవన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రీయ విధానంతో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. దీనికి తగినట్టుగా స్థానిక సంస్థలతో కలిసి స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పనిచేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాలని స్వచ్చాంధ్రప్రదేశ్ కార్పొరేషన్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు మంత్రి సూచించారు.
ఈ కార్యాచరణను ప్రత్యేక ప్రణాళిక ద్వారా పిఠాపురం, భీమవరం నియోజకవర్గాలలో తొలుత అమలు చేయాలన్నారు. స్థానిక సంస్థలతో పాటు ప్రజలను చైతన్యవంతులను చేసి తమ గ్రామాలను స్వచ్ఛంగా ఉంచుకునేందుకు ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన సూచించారు. ఇళ్ల నుంచి వచ్చే వ్యర్ధాలను పునర్వినియోగంలోకి తీసుకువచ్చే విధానాలను వారికి తెలియజేయాలన్నారు. పర్యావరణం పై మక్కువ ఉన్నవారిని ఎకో వారియర్స్ గా సెలక్ట్ చేసి వారిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
ఇదే సమయంలో నగరాలు, పట్టణాలు, మేజర్ గ్రామపంచాయతీలలో ఉన్న డంపింగ్ యార్డుల సమస్య తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. భీమవరం పట్టణానికి సంబంధించిన డంపింగ్ యార్డు సమస్య తీవ్రతను తాను స్వయంగా చూశానన్నారు. నదీ పరివాహక ప్రాంతాలలో చెరువులు, కాలువల వెంబడి చెత్త వేసే విధానాలను ఆపాలన్నారు. నదీ పరివాహక ప్రాంతాలు చెరువులు, కాలువల గట్లను చెత్త వేసే కేంద్రాలుగా మార్చకూడదని, ప్రజలు, వాణిజ్య సంస్థల వారు అక్కడ చెత్త వేయకుండా చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు.