
Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈశాన్య బోర్నూ రాష్ట్రంలో మూడు బాంబు పేలుళ్లు జరుగగా దాదాపు 18 మంది మృతి చెందారు. మరో 48 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. నిన్న (శనివారం) స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఓ వివాహ వేడుకలో మొదటి పేలుడు సంభవించింది. ఆ తరువాత గ్వోజాలో రెండో పేలుడు, అనంతరం అంత్యక్రియల వద్ద మూడో పేలుడు జరిగింది.
బోర్నూ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ బార్కిండో మొహమ్మద్ సైదు గ్వోజా టౌన్ లో జరిగిన పేలుడు స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని రెస్క్యూ సిబ్బంది చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుళ్లకు పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.